Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 14 April 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

షారుఖ్ ఖాన్ డైలాగ్ తో అమెరికాకు ఇరాన్ వార్నింగ్..!

  • ఇరాన్ నౌకా దళాన్ని నాశనం చేశామని ట్రంప్ ప్రకటన
  • జస్ట్ ట్రైలర్ మాత్రమే చూశారు.. సినిమా ముందుందన్న ఇరాన్
  • పిక్చర్ అభి బాకీ హై అంటూ తమ యుద్ధ నౌకల వీడియో రిలీజ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ సినిమా స్టైల్‌లో గట్టి కౌంటర్ ఇచ్చింది. తమ దాడుల్లో ఇరాన్ నౌకాదళం దాదాపు అంతమైపోయిందన్న ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సినిమాలోని ‘పిక్చర్ అభీ బాకీ హై’ (అసలు సినిమా ముందుంది) అనే డైలాగ్‌తో హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇరాన్ నౌకాదళం పూర్తిగా కనుమరుగైపోయిందని ప్రకటించారు. అమెరికా దళాలు ఇప్పటికే 158 ఇరాన్ నౌకలను సముద్రంలో ముంచివేశాయని పేర్కొన్నారు. కేవలం కొన్ని ఫాస్ట్ అటాక్ షిప్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటిని తాము పెద్ద ముప్పుగా పరిగణించడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ ఆరోపణలను తిప్పికొడుతూ ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ఒక వీడియోను విడుదల చేసింది. తమ వేగవంతమైన క్షిపణి బోట్లను ‘పర్షియన్ గల్ఫ్ ఎర్ర తేనెటీగలు’గా అభివర్ణిస్తూ, అవి ఇప్పుడే వార్మప్ అవుతున్నాయని తెలిపింది. ‘ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది’ అని పేర్కొంటూ, తమ చిన్న పడవల గుంపు శత్రువును ఎంత వేగంగా చుట్టుముట్టగలదో త్వరలోనే చూస్తారని అమెరికాకు బదులిచ్చింది. హర్మూజ్ జలసంధిపై తమకే పూర్తి పట్టు ఉందని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా యుద్ధ నౌకలు, ఇరాన్ మిస్సైల్ బోట్ల మధ్య మాటల యుద్ధం, సైనిక ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి.