Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 14 April 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

అడ్డంగా నరుకుతామన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు వివరణ…

  • కార్యకర్తలను బెదిరిస్తే అడ్డంగా నరుకుతామన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
  • కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే అలా మాట్లాడారన్న శ్రీధర్ బాబు
  • చట్టాన్ని అతిక్రమించే ఉద్దేశం ఎవరికీ లేదని వ్యాఖ్య

రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. మంథనిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరైనా బెదిరిస్తే “అడ్డంగా నరుకుతాం” అంటూ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఈ వివాదంపై స్పందిస్తూ వివరణ ఇచ్చారు.

రాజ్ ఠాకూర్ శాంతిని కోరుకునే వ్యక్తి అని, ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలను చాలా మంది బెదిరిస్తుండటంతో వారికి ధైర్యం చెప్పే క్రమంలోనే ఆయన ఆవేశంగా మాట్లాడారని మంత్రి సమర్థించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కార్యకర్తలు తమ బాధలు చెప్పుకున్నప్పుడు వారిలో భరోసా నింపేందుకు అలా స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. శాంతికి విఘాతం కలిగించే ఆలోచనలు ఎవరు చేసినా తమ ప్రభుత్వం ఖండిస్తుందని, చట్టాన్ని అతిక్రమించే ఉద్దేశం ఎవరికీ లేదని మంత్రి స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే?..

మంథనిలో జరిగిన ఒక సమావేశంలో రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. “మంథనిలో ప్రతిరోజూ శ్రీధర్ బాబు ఉండకపోవచ్చు. కానీ కార్యకర్తలను ఎవరైనా బెదిరిస్తే మేము 2 గంటల్లో ఇక్కడికి వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే వారిని అడ్డంగా నరుకుతాం” అని వ్యాఖ్యానించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.