Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 14 April 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

మోదీకి ట్రంప్ ఫోన్… 40 నిమిషాల పాటు సంభాషణ…

  • ఈ సంవత్సరం వీరిద్దరు ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇది మూడోసారి
  • ద్వైపాక్షిక సహకారం సాధించిన పురోగతిపై చర్చించినట్లు వెల్లడి
  • పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధిపై చర్చించామన్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్‌లో సంభాషించుకున్నారు. ఈ సంవత్సరం వీరిద్దరు ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇది మూడోసారి. పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి వారిద్దరు మాట్లాడుకోవడం ఇది రెండోసారి. తాజాగా, తనకు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.

మిత్రుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని పేర్కొన్నారు. వివిధ రంగాలలో అమెరికా, భారత్ ద్వైపాక్షిక సహకారం సాధించిన గణనీయమైన పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు. అన్ని రంగాల్లో ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలోని పరిస్థితులపై కూడా తమ మధ్య చర్చ జరిగిందని వెల్లడించారు. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, స్వేచ్ఛగా, సురక్షితంగా నిర్వహించడం ఎంత అవసరమో నొక్కి చెప్పామని మోదీ పేర్కొన్నారు.

కాగా, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమైన నేపథ్యంలో వీరిద్దరు మాట్లాడుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.