Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 19 April 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

భారత నౌకపై కాల్పుల ఘటనలో వైరల్ గా మారిన షిప్ కెప్టెన్ మెసేజ్..!

  • ముందు అనుమతిచ్చి ఇప్పుడు కాల్పులా.. వెనక్కి వెళ్లిపోతున్నామన్న కెప్టెన్
  • హార్ముజ్ జలసంధిలో సన్మార్ హెరాల్డ్, జగ్ అర్నవ్ ట్యాంకర్లపై ఫైరింగ్
  • ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం
  • ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ

హర్మూజ్ జలసంధిలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ గస్తీ దళాలు శనివారం కాల్పులకు తెగబడ్డాయి. ఈ అనూహ్య పరిణామంతో నౌకలు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనక్కి మళ్లాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, నౌకలకు కూడా నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.

‘సన్మార్ హెరాల్డ్’, ‘జగ్ అర్నవ్’ అనే భారతీయ నౌకలపై ఈ కాల్పులు జరిగాయి. ఘటన సమయంలో ‘సన్మార్ హెరాల్డ్’ సిబ్బంది పంపిన ఆడియో సందేశం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ‘‘సెపా నేవీ.. సెపా నేవీ.. మీరు మాకు అనుమతి ఇచ్చారు. లిస్ట్ లో రెండో పేరు మాదే. కానీ ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. దయచేసి మమ్మల్ని వెనక్కి వెళ్లనివ్వండి’’ అని ఓ సిబ్బంది ఇరాన్ నేవీని వేడుకోవడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపించింది.

ఈ ఘటనను భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. వెంటనే రంగంలోకి దిగిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఢిల్లీలోని ఇరాన్ రాయబారిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వాణిజ్య నౌకల భద్రతకు భంగం కలిగించడంపై తీవ్ర ఆందోళనను తెలియజేసింది. దీనిపై స్పందించిన ఇరాన్ రాయబారి, భారత ప్రభుత్వ అభిప్రాయాలను తమ ఉన్నతాధికారులకు చేరవేస్తానని హామీ ఇచ్చారు.

వారం క్రితం భారత నౌకలకు సురక్షిత మార్గం కల్పిస్తామని ప్రకటించిన ఇరాన్, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం. జలసంధిలోకి ప్రవేశించే ఏ నౌకనైనా శత్రువుగా పరిగణించి లక్ష్యంగా చేసుకుంటామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ కాల్పుల ఘటన జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.