Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 22 April 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

కొడగు హోంస్టేలో అమెరికా టూరిస్ట్‌పై అత్యాచారం…

  • కర్ణాటక కొడగులో అమెరికా మహిళా టూరిస్ట్‌పై అత్యాచారం
  • హోంస్టే సిబ్బంది, యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • విషయం బయటకు రాకుండా బాధితురాలిని 3 రోజులు నిర్బంధించిన యజమాని
  • అమెరికా ఎంబసీ జోక్యంతో వెలుగులోకి ఘటన

కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొడగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన ఓ మహిళా టూరిస్ట్‌పై హోంస్టేలో అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి హోంస్టే యజమాని, అక్కడ పనిచేసే ఓ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారం రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బాధితురాలు బస చేసిన హోంస్టేలోని గదిలో సిబ్బంది ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న యజమాని, ఆమెకు సహాయం చేయకపోగా నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. మూడు రోజుల పాటు బాధితురాలిని నిర్బంధించి, ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఎవరికీ ఫిర్యాదు చేయవద్దని బెదిరించాడు.

అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు మైసూరు చేరుకుని, అమెరికా అధికారులను సంప్రదించింది. యూఎస్ ఎంబసీ ద్వారా విషయం తెలుసుకున్న కర్ణాటక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనను కొడగు జిల్లా ఎస్పీ ధ్రువీకరించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని, వారికి మే 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారని ఆయన తెలిపారు. ఈ ఘటనపై విదేశాంగ శాఖ అధికారులు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.