కేరళ రాజకీయాల్లో ఒక యువకుడి విజయం స్ఫూర్తిదాయక కథగా నిలిచింది. కొంతకాలం క్రితం ముఖ్యమంత్రి పినరయి విజయన్ యాత్రలో నిరసన తెలిపి దాడికి గురైన ఏడీ థామస్ ఇప్పుడు అలప్పుళ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. తనపై జరిగిన దాడిని రాజకీయ విజయంగా మార్చుకుని, సామాన్యుడి గొంతుకగా చట్టసభకు వెళ్తున్నారు.
సోమవారం వెలువడిన ఫలితాల్లో 30 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థి ఏడీ థామస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, లెఫ్ట్ నేత పీపీ చిత్తరంజన్పై 21,015 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. లెఫ్ట్ కంచుకోటగా భావించే ఈ స్థానంలో ఆయన విజయం ఒక రాజకీయ ప్రకంపనగా మారింది. థామస్ నేపథ్యం ఎంతో సామాన్యమైనది. ఆయన తండ్రి డొమినిక్ జాక్సన్ చేపలు అమ్మి పిల్లలను చదివించారు. చిన్నప్పుడు థామస్ కూడా తండ్రితో కలిసి పడవలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లేవారు.
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్న థామస్, అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనపై 18 కేసులు కూడా నమోదయ్యాయి. ముఖ్యమంత్రి నవ కేరళ యాత్రలో నల్లజెండా ప్రదర్శించినందుకు దాడికి గురైన ఘటనతో ఆయన రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన పోరాట పటిమను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ, అలప్పుళ నుంచి బరిలోకి దింపగా ప్రజలు భారీ మెజార్టీతో ఆమోదముద్ర వేశారు.
“వాడు నాలా మిగిలిపోతాడేమోనని భయపడ్డాను. ఇప్పుడు ప్రజలకు నాయకత్వం వహించబోతున్నాడు” అని ఆయన తండ్రి గర్వంగా తెలిపారు. సముద్రపు అలలతో పోరాడిన ఒక సామాన్యుడు, ఇప్పుడు చట్టసభలో తమ గొంతుకగా మారబోతున్నాడని అలప్పుళ తీరప్రాంత ప్రజలు భావిస్తున్నారు.