Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 06 May 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

తమిళనాడు గవర్నర్‌ను కలిసిన టీవీకే పార్టీ అధినేత విజయ్…

  • లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్
  • ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానం నేపథ్యంలో కలిసిన విజయ్
  • నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం విజయ్‌కి ఆహ్వానం పంపించింది. ఈ క్రమంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు తగిన బలం ఉందని చెప్పడానికి లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. తనకు మద్దతిచ్చే జాబితాతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశారు.

ఇప్పటికే, చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేశాయి. కానీ ఎన్నికల అనంతరం, టీవీకేకు మెజారిటీ కొన్ని సీట్లు తగ్గడంతో కాంగ్రెస్ టీవీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధమైంది.