Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 08 May 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

హస్కీ కుక్కల కేసులో వీడిన మిస్టరీ.. నలుగురి అరెస్ట్…

  • సంగారెడ్డిలో హస్కీ కుక్కలను వదిలేసిన ఘటనలో పురోగతి
  • ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన బీడీఎల్ భానూరు పోలీసులు
  • ఖర్చు భరించలేకే కుక్కలను వదిలేసినట్లు విచారణలో వెల్లడి
  • ఈ కుక్కలను కల్వరి టెంపుల్‌లో పెంచినట్లు గుర్తింపు
  • టెంపుల్ లైసెన్సులపై జీహెచ్‌ఎంసీకి లేఖ రాసిన జిల్లా ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో ఖరీదైన సైబీరియన్ హస్కీ జాతి కుక్కలను నడిరోడ్డుపై వదిలేసిన ఘటనలో మిస్టరీ వీడింది. వాటిని పెంచేందుకు అయ్యే ఖర్చు భరించలేక, వయసు పెరగడంతో వదిలించుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు బీడీఎల్ భానూరు పోలీసులు తెలిపారు.

పటాన్‌చెరు మండలం నందిగామ శివారులో ఇటీవల పలు సైబీరియన్ హస్కీ కుక్కలు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కుక్కలను తరలించిన ఆటో ట్రాలీని మియాపూర్‌లోని కల్వరి టెంపుల్ సమీపంలో గుర్తించారు. విచారణలో భాగంగా ఫతేనగర్‌కు చెందిన సత్యనారాయణ, సుధీర్ బాబు, సుందర్ సింగ్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో నిందితులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కుక్కలను హైదరాబాద్‌లోని హైదర్ నగర్ కల్వరి టెంపుల్‌లో పెంచినట్లు తేలింది. వాటి వయసు పెరగడం, సంరక్షణ భారం కావడంతో నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టినట్లు అంగీకరించారు. అయితే, ఎండ వేడిని తట్టుకోలేక, సరైన ఆహారం లేకపోవడంతో ఓ శునకం ఇప్పటికే మృతి చెందింది.

ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్పందించారు. కల్వరి టెంపుల్‌లో శునకాలను పెంచడానికి అవసరమైన లైసెన్స్‌లు, అనుమతులు ఉన్నాయా అనే దానిపై సమగ్ర వివరాలు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. కేవలం స్టేటస్ సింబల్ కోసం ఖరీదైన జంతువులను కొనుగోలు చేసి, వాటి పోషణ కష్టంగా మారగానే ఇలా వదిలేయడంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు జంతువులను అనాథలుగా వదిలేయడం చట్టరీత్యా నేరమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.