Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 12 May 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి.. నలుగురు అరెస్ట్!

  • కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి
  • నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • బెంగాల్, బీహార్‌లో నిందితులను పట్టుకున్న ప్రత్యేక బృందాలు
  • దొంగిలించిన నగలను బెంగాల్ వ్యాపారికి అమ్మినట్టు వెల్లడి
  • పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం కొనసాగుతున్న గాలింపు

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన కరీంనగర్‌ పీఎంజే జ్యువెలరీ షోరూం దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాలోని నలుగురు సభ్యులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వీరిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. నిందితులను రహస్య ప్రాంతంలో విచారిస్తుండగా, దోచుకున్న బంగారాన్ని బెంగాల్‌కు చెందిన ఓ వ్యాపారికి విక్రయించినట్లు వారు అంగీకరించినట్టు తెలుస్తోంది. వారి వద్ద నుంచి కొంత బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మే 3వ తేదీన కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షోరూంలోకి కస్టమర్ల రూపంలో బైక్‌లపై వచ్చిన ఐదుగురు దుండగులు, తుపాకులతో సిబ్బందిని బెదిరించి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు సిబ్బంది గాయపడ్డారు. అనంతరం సుమారు 1.6 కిలోల బంగారు ఆభరణాలు, నగదుతో పరారయ్యారు.

ఈ ఘటనను సవాల్‌గా స్వీకరించిన పోలీసులు, పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి, వారి కదలికలను ఇతర రాష్ట్రాల వరకు ట్రాక్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఇంకా పరారీలోనే ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే మీడియా సమావేశంలో వెల్లడిస్తామని కరీంనగర్ పోలీసులు పేర్కొన్నారు.