Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 12 May 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ భేటీ…

ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్
పార్టీ సంస్థాగత మార్పులు, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం 
పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఫోకస్

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కీలక సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత మార్పులు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం… జిల్లా, నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం, అలాగే అంతర్గత కమిటీల ఏర్పాటుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ఈ సంస్థాగత మార్పులు దోహదపడతాయని నాయకత్వం భావిస్తోంది.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ, మండలి పక్షాల ప్రముఖ నేతలు పాల్గొన్నారు. హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మధుసూదనాచారి, ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బండ ప్రకాశ్ ముదిరాజ్, వి. గంగాధర్ గౌడ్, జోగినపల్లి సంతోశ్ కుమార్, నారదాసు లక్ష్మణరావు, ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టి. జీవన్ రెడ్డి, సోమా భరత్ కుమార్ గుప్తా, సత్యవతి రాథోడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా సురేశ్ రెడ్డి, మహమూద్ అలీ, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు ఇతర రాజకీయ సవాళ్లపై ఈ సమావేశంలో నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తూనే, ప్రజల్లోకి పార్టీని మరింత సమర్థవంతంగా తీసుకువెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలను ఈ సమావేశంలో సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని, అలాగే జిల్లా పర్యటనల ద్వారా క్యాడర్‌తో నేరుగా మమేకం కావాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.