Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 19 August 2023
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ఏపీ బీజేపీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన పురందేశ్వరి

  • ఇటీవలే ఏపీ బీజేపీ పగ్గాలు అందుకున్న పురందేశ్వరి
  • రాష్ట్ర కార్యవర్గానికి కొత్త రూపు
  • మొత్తం 26 మందితో ఏపీ బీజేపీ కార్యవర్గం
  • వివిధ కమిటీలు, మోర్చాలకు అధ్యక్షుల నియామకం

ఇటీవలే ఏపీ బీజేపీ చీఫ్ గా పగ్గాలు అందుకున్న దగ్గుబాటి పురందేశ్వరి తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. తాజాగా ఆమె రాష్ట్ర బీజేపీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యవర్గంలో 26 మందికి స్థానం కల్పించారు. 

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్, ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్ రాజుతో పాటు మరో 11 మంది నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కాశీ విశ్వనాథరాజు, బిట్ర శివన్నారాయణ, దయాకర్ రెడ్డి, తపనా చౌదరి నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శులుగా 10 మందికి అవకాశం కల్పించారు.

పురందేశ్వరి పలు మోర్చాలకు కూడా అధ్యక్షులను ప్రకటించారు. బీజేపీ ఏపీ యువ మోర్చా అధ్యక్షుడిగా మిట్టా వంశీని, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నిర్మలా కిశోర్ ను నియమించారు. 

బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా కుమారస్వామి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా దేవానంద్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా గోపీ శ్రీనివాస్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా ఉమామహేశ్వరరావు, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా షేక్ బాజీ నియమితులయ్యారు. 

ఇక, బీజేపీ రాష్ట్ర  మీడియా ఇన్చార్జిగా పాతూరి నాగభూషణంను నియమించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఏడుగురికి అవకాశం కల్పించారు.