Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 24 October 2023
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనలపై కాంగ్రెస్ ప్రకటన

  • ఈ నెల 31న జరిగే కొల్లాపూర్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
  • వచ్చే నెల మొదటి వారంలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందన్న మహేశ్ కుమార్ గౌడ్
  • రెండో విడత బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొంటారని వెల్లడి

పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటనలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 31న కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజా భేరీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సభ ఉంటుందని, ఈ సభకు ప్రియాంక గాంధీ వస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు సాయంత్రం ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా కొల్లాపూర్ చేరుకుంటారన్నారు.

ఇక వచ్చే నెల మొదటి వారంలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని, రెండో విడత బస్సు యాత్రలో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఇక ఈ నెల 26, 27 తేదీల్లో తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీమ్‌లపై ప్రచారం చేస్తూ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటిస్తారన్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని, తమ పార్టీ అత్యధిక స్థానాలను గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తమ వైపున ఉన్నారని, డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.