Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 24 October 2023
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

రాణీ రుద్రమకు బీజేపీ సిరిసిల్ల టిక్కెట్ ఇవ్వడంతో, బీఆర్ఎస్‌లో చేరిన కీలక నేత!

  • అనుచరులతో కలిసి బీఆర్ఎస్‌లో చేరిన ఆవునూరి రమాకాంత్
  • ప్రగతి భవన్‌లో కేటీఆర్, హరీశ్ రావుల సమక్షంలో బీఆర్ఎస్‌లోకి
  • స్థానిక నాయకులతో చర్చించకుండానే రాణి రుద్రమకు టిక్కెట్ ఇచ్చారని ఆరోపణ

అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిరిసిల్లలో బీజేపీకి షాక్ తగిలింది. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ న్యాయవాది, బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న ఆవునూరి రమాకాంత్ బీజేపీకి రాజీనామా చేసి, అధికార బీఆర్ఎస్‌లో చేరారు. తన అనుచరులతో కలిసి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల సమక్షంలో మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో కారు ఎక్కారు. 

ఈ సందర్భంగా ఆవునూరి మాట్లాడుతూ… సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. అంతకుముందు సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీలో లోపల అన్నీ గ్రూపు రాజకీయాలే ఉన్నాయని విమర్శించారు. బండి సంజయ్ నాయకత్వాన్ని నమ్ముకుని తాము బీజేపీలో చేరామన్నారు. కానీ తమకు అన్యాయం జరిగిందన్నారు. సిరిసిల్లలో స్థానిక నాయకులతో చర్చించకుండా నర్సంపేటకు చెందిన రాణి రుద్రమకు తమ నియోజకవర్గం టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయంపై మనస్తాపంతో బీజేపీకి రాజీనామా చేసినట్లు చెప్పారు.