Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 28 November 2023
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

కొత్తగూడెంలో వనమా గెలుపు కోసం ఎంపీ వద్దిరాజు బుల్లెట్ పై హల్చల్

కొత్తగూడెంలో బీఆర్ యస్ అభ్యర్థి వనమా గెలుపు కోసం ఎంపీ వద్దిరాజు బుల్లెట్ పై ర్యాలీలో పాల్గొని హల్చల్ చేశారు …యువకులను ఉత్సహపరిచారు …రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్షఅని వనమా గెలుపు ద్వారా సీఎం కేసీఆర్ ను మూడవసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపు నిచ్చారు …బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా ముగిసిందని,ఇతర పార్టీలు తమకు దరిదాపుల్లో కూడా లేవని వద్దిరాజు రవిచంద్ర అన్నారు .ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి,బీఆర్ఎస్ మేనిఫెస్టో,ప్రచారం పట్ల అన్ని వర్గాల ప్రజలు సానుకూలంగా స్పందించారన్నారు.ఎన్నికల ప్రచారం చివరిరోజు మంగళవారం కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది.ఈ ర్యాలీ విద్యానగర్ బైపాస్ నుంచి మొదలై అంబేడ్కర్ విగ్రహం, రైల్వేస్టేషన్, ఇల్లందు క్రాస్ రోడ్స్, కలెక్టరేట్,పాత పాల్వంచ, అంబేడ్కర్ చౌరస్తాల మీదుగా జగన్నాథపురం పెద్దమ్మ తల్లి గుడి వరకు సాగింది.ఈ ర్యాలీలో ఎంపీ రవిచంద్ర బుల్లెట్ నడుపుతూ యువకులను మరింత ఉత్సాహపర్చారు.గులాబీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, యువకులు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, జీపులు,ప్రచారరథాలపై తరలివచ్చారు.ర్యాలీలో బీఆర్ఎస్ అభ్యర్థి వనమా ప్రచారరథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.యువకులు టపాకాయలు కాల్చుతూ,ఉద్యమ పాటలు, నినాదాలు,ఆడుతూ పాడుతూ,కేరింతలు ఉత్సాహభరిత వాతావరణం మధ్య ర్యాలీ పెద్దమ్మ తల్లి గుడి వద్దకు చేరింది.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అని, బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం రాష్ట్ర వ్యాపితంగా దిగ్విజయంగా ముగిసిందన్నారు.కొత్తగూడెం నియోజకవర్గం అంతా కూడా గులాబీమయమైందని,కళకళలాడుతున్నదని పేర్కొన్నారు.ప్రతిపక్షాల మాయమాటల్ని విశ్వసించవద్దని ఎంపీ రవిచంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కేసీఆర్ సుపరిపాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని,అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు చెందిన వారంతా ప్రశాంతంగా జీవిస్తున్నారని ఎంపీ రవిచంద్ర వివరించారు.రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేసిన, చేస్తున్న కేసీఆర్ ని మనమందరం కలిసికట్టుగా హ్యాట్రిక్ సీఎంను చేద్దామన్నారు.ఇందుకుగాను ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఈబీసీ, మైనారిటీలందరూ ఏకోన్ముఖులై కారు గుర్తుకు ఓటేసీ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కి సంపూర్ణ మద్దతునివ్వాల్సిందిగా ఎంపీ వద్దిరాజు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఆ తర్వాత ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే వెంకటేశ్వరరావులు గుడికి చేరుకుని పెద్దమ్మ తల్లికి భక్తిప్రపత్తులతో ప్రత్యేక పూజలు చేశారు,వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.ఈ ర్యాలీలో బీఆర్ఎస్ ప్రముఖులు ఎడవల్లి కృష్ణ, మానవతారాయ్,మునిసిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ,జేవీస్ చౌదరి, ఎడవల్లి నవీన్,భీమా శ్రీధర్,మోరే భాస్కర్,భూక్యా చందూనాయక్,రావి రాంబాబు,పరమేష్ యాదవ్,రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.