Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 10 January 2024
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

రాహుల్ గాంధీకి షాకిచ్చిన మణిపూర్ బీజేపీ ప్రభుత్వం

  • భారత్ జోడో న్యాయ్ యాత్రకు అనుమతి నిరాకరించిన మణిపూర్ ప్రభుత్వం
  • శాంతిభద్రతల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిరాకరించిన బీజేపీ ప్రభుత్వం
  • రాజకీయం చేయవద్దని కాంగ్రెస్ నేతల సూచన

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి మణిపూర్ ప్రభుత్వం షాకిచ్చింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న భారత్ జోడో న్యాయ్ యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈస్ట్ ఇంఫాల్ జిల్లా హప్టా కాంగ్జీబంగ్ అనే పోలో గ్రౌండ్ నుంచి ఈ యాత్రను ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కానీ శాంతిభద్రతల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. తమ యాత్ర రాజకీయ ప్రయత్నం కాదని… రాహుల్ గాంధీ యాత్రను రాజకీయం చేయవద్దని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. మరోవైపు మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మేఘచంద్ర ఆధ్వర్యంలో పలువురు పార్టీ నేతలు బుధవారం ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ను కలిశారు. సీఎంతో భేటీ అనంతరం మేఘచంద్ర మాట్లాడుతూ… రాష్ట్రంలో శాంతిభద్రతలను సాకుగా చూపిస్తూ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.