Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 10 January 2024
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు పోవడంతో వారి ఆటలు సాగడం లేదు: మంత్రి సీతక్క

  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలపై మంత్రి సమీక్ష
  • ఆదిలాబాద్ అక్షరక్రమంలో ముందున్నప్పటికీ అభివృద్ధిలో వెనుకబడిందన్న సీతక్క
  • ఈ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని వెల్లడి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు పోవడంతో వారి ఆటలు సాగడం లేదని.. దీంతో తమ ప్రభుత్వంపై వారు విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. బుధవారం నాడు నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్స్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆదిలాబాద్ అక్షర క్రమంలో ముందు ఉన్నప్పటికీ… అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకబడి ఉందన్నారు. సరస్వతీదేవి కొలువైన ప్రాంతం… మహనీయులు పుట్టిన ప్రాంతం… కానీ అభివృద్ధిని విస్మరించారన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అధికారుల ప్రత్యేక సమావేశంలో సూచించారన్నారు. ఓడిపోయిన అభ్యర్థులు కూడా ప్రజలలో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని సూచించారు. మహిళల కోసం తాము ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తే… ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆటో డ్రైవర్లతో ఆందోళనలు చేయిస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే బీఆర్ఎస్ తమపై విమర్శలు చేయడం ప్రారంభించిందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే… కేసీఆర్ కుటుంబం పదవులను అనుభవించిందన్నారు.