Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 24 April 2024
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

దేశం కోసం నా తల్లి మంగళసూత్రాన్ని త్యాగం చేసింది: ప్రియాంక గాంధీ

  • కాంగ్రెస్ దేశ సంపదను చొరబాటుదారులకు దోచి పెడుతోందన్న ప్రధాని
  • మహిళల మంగళసూత్రాల్నీ కాంగ్రెస్ వదిలిపెట్టదంటూ సంచలన కామెంట్స్
  • ప్రధాని వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ వాద్రా సీరియస్
  • తన అమ్మమ్మ యుద్ధ సమయంలో తన బంగారాన్ని ఇచ్చేసిందని గుర్తుచేసిన వైనం

దేశ ప్రజల సంపదను కాంగ్రెస్ చొరబాటుదారులకు కట్టబెడుతోందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. మహిళల మంగళసూత్రాల్ని కూడా కాంగ్రెస్ వదలిపెట్టదన్న ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన ఆమె.. తన తల్లి దేశం కోసం మంగళసూత్రం త్యాగం చేసిందన్నారు. తన అమ్మమ్మ తన బంగారాన్ని యుద్ధం సమయంలో దేశం కోసం ఇచ్చేసిన విషయాన్ని ప్రస్తావించారు. బెంగళూరులో జరిగిన ఓ సభలో ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ కామెంట్స్ చేశారు. 

‘‘కాంగ్రెస్ మీ బంగారాన్ని, చివరకు మంగళసూత్రాన్ని కూడా తీసుకుంటుందని ఆయన అంటున్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో కాంగ్రెస్ 55 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. మరి మీ బంగారాన్ని కానీ, మంగళసూత్రాన్ని కానీ ఎవరైనా దోచుకున్నారా?’’ అని ఆమె ప్రశ్నించారు. 

‘‘400 సీట్లు దాటితే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రధాని ఓసారి అంటారు. మరోసారి తనను అకారణంగా విమర్శిస్తున్నారని అంటారు. ఇంకోసారి మతం గురించి మాట్లాడతారు. అత్యంత అధునాతన నగరాల్లో ఉంటున్న మీలాంటి వారికి ఇది అవసరమా?’’ అని ఆమె ప్రశ్నించారు. 

అసలు ప్రధానికి మంగళసూత్రం ప్రాముఖ్యత గురించి తెలుసా? అని ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నించారు. ‘‘నోట్ల రద్దు సమయంలో మహిళలు తాము దాచుకున్న సొమ్ము కోల్పోయారు. రైతు నిరసనల సమయంలో 600 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి అప్పుడు మోదీ మహిళల మంగళసూత్రాల గురించి ఆలోచించారా?’’ అని ప్రశ్నించారు.