Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 06 June 2024
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు.. ఆప్ ప్రకటన

  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు ప్రకటన
  • కాంగ్రెస్‌తో పొత్తు లేదని క్లారిటీ ఇచ్చిన పార్టీ సీనియర్ గోపాల్ రాయ్
  • వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్‌తో పొత్తు కేవలం లోక్‌సభ ఎన్నికలకు మాత్రమేనని ఆ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ గురువారం వెల్లడించారు. ఆప్ ఎమ్మెల్యేలతో గురువారం భేటీ నిర్వహించిన అనంతరం రాయ్ ఈ ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని తొలిరోజే స్పష్టం చేశామని గోపాల్ రాయ్ ప్రస్తావించారు. ఆప్ తన సంపూర్ణ బలంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతుందని అన్నారు. కాగా 2025 ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు ఆప్ పార్టీ ఇండియా కూటమిలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలు ఉండగా పొత్తులో భాగంగా నాలుగు సీట్లలో ఆప్, మూడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేశాయి. అయితే అనూహ్య రీతిలో మొత్తం స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్, ఆప్ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఢిల్లీ, పంజాబ్, గుజరాత్‌లలో కూడా కాంగ్రెస్, ఆప్ సహకరించుకున్న విషయం తెలిసిందే.