Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 21 August 2024
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

కొత్త పార్టీని స్థాపిస్తున్న చంపయీ సొరేన్…

  • వేగంగా మారుతున్న ఝార్ఖండ్ రాజకీయ పరిణామాలు
  • జేఎంఎంలో అవమానాలు ఎదుర్కొన్నానన్న చంపయీ సొరేన్
  • ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యాఖ్య

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఝార్ఖండ్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. జేఎంఎం నేత, మాజీ ముఖ్యమంత్రి చంపయీ సొరేన్ బీజేపీలో చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా జరిగింది. అయితే, ఈరోజు ఆయన కీలక ప్రకటన చేశారు. తాను కొత్త పార్టీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నానని వెల్లడించారు. ఎంతో మంది తనకు మద్దతుగా ఉన్నారని, ఇది తన జీవితంలో కొత్త అధ్యాయమని చెప్పారు. ఒక కొత్త పార్టీని ప్రారంభించి, దాన్ని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నానని తెలిపారు. తన ప్రయాణంలో ఒక మంచి మిత్రుడు కలిస్తే వారితో కలిసి ముందుకు వెళ్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీని ప్రారంభిస్తానని వెల్లడించారు.

జేఎంఎంలో ఇటీవల అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సొంత పార్టీ అధినాయకత్వంపైనే ఝార్ఖండ్ టైగర్ గా పేరొందిన చంపయీ సొరేన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని… ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సిన సమయం తనకు ఆసన్నమయిందని చెప్పారు. 

మరోవైపు ఈ పరిణామాలపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తీవ్రంగా స్పందించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ యత్నిస్తోందని మండిపడ్డారు. ఈ కారణంగానే అసెంబ్లీ ఎన్నికల ప్రకటనను కూడా ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు.