Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 25 October 2024
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

మూడు నెలలు మూసీ పక్కన నివాసం ఉండేందుకు నేను సిద్ధం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి …!

రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా…

  • మూసీ ప్రాంత ప్రజల కోసం అక్కడ ఉండేందుకు సిద్ధమేనన్న కిషన్ రెడ్డి
  • హామీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆగ్రహం
  • మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదన్న కిషన్ రెడ్డి

మూసీ పరీవాహక ప్రాంతంలో మూడు నెలల పాటు ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందిరాపార్క్ వద్ద మూసీ ప్రాంతాల్లోని పేదల ఇళ్ల కూల్చివేతలను నిరసిస్తూ బీజేపీ అధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ… మూసీ పరీవాహక ప్రాంతంలో ఉంటున్న ప్రజల కోసం తాను అక్కడ ఉండేందుకు సిద్ధమేనన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోందని, కానీ నిరుపేదలకు ఇచ్చేందుకు ఏ ఇంటికీ శంకుస్థాపన చేయలేదన్నారు. కానీ దశాబ్దాలుగా నివసిస్తున్న వారి ఇళ్లను కూల్చివేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. హామీల పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి, సోనియా, రాహుల్ గాంధీ మభ్యపెట్టారని ఆరోపించారు.

బీఆర్ఎస్ హయాంలో కూడా ప్రజల ఇళ్లకు మార్కింగ్ చేసి భయపెట్టారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే దారిలో నడుస్తోందని మండిపడ్డారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ ఏళ్లగా అక్కడ ఉంటున్న వారి ఇళ్లను కూల్చివేస్తే ఊరుకునేది లేదన్నారు. రిటైనింగ్ వాల్‌తో సుందరీకరణ చేసుకోవాలని సూచించారు. మూసీ పక్కన ఉండలేకపోతున్నామని బాధితులు ఎవరైనా చెప్పారా? అని కిషన్ రెడ్డి నిలదీశారు.