Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 27 October 2024
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

పూణే ఓటమిపై రోహిత్ …జట్టులోని ఎవరి సామర్థ్యాన్నీ తాను అనుమానించడం లేదు ..!

  • ఒత్తిడిని సరిగ్గా ఎదుర్కోలేకపోయామన్న కెప్టెన్
  • మొదటి ఇన్నింగ్స్‌లో సరిగా బ్యాటింగ్ చేయలేదని అంగీకారం
  • ఈ సిరీస్ ఓటమికి ముందు 18 సిరీస్‌లు గెలిచామని సమర్థించుకున్న రోహిత్ శర్మ

పూణే వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక జట్టు న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 113 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో 2012 తర్వాత భారత్ స్వదేశంలో తొలి టెస్ట్ సిరీస్‌ను కోల్పోయినట్టు అయింది. ఈ ఘోర ఓటమిపై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌లో ఎదుర్కొన్న ఒత్తిడికి ప్రతిస్పందించడంలో తాము విఫలమయ్యామని సమర్థించుకున్నాడు.

తాము మొదటి ఇన్నింగ్స్‌లో సరిగా బ్యాటింగ్ చేయలేదని, పిచ్ అంత పేలవంగా ఏమీ లేదు, కానీ న్యూజిలాండ్ సాధించిన స్కోరు చేరుకోలేకపోయామని రోహిత్ అన్నాడు. శుభ్‌మాన్ గిల్-యశస్వి జైస్వాల్ మంచి భాగస్వామ్యం అందించినా ఆ తర్వాత ఇన్నింగ్స్ సరిగా సాగలేదని అన్నాడు. గత రెండు టెస్ట్ మ్యాచ్‌లలో తప్పులు దొర్లాయని వ్యాఖ్యానించాడు.

ఇక సిరీస్‌ను కోల్పోవడంపై స్పందిస్తూ.. ఈ సిరీస్‌ను కోల్పోవడానికి ముందు తాము 18 సిరీస్‌లు గెలిచామని రోహిత్ అన్నాడు. కాబట్టి తాము చాలా విషయాల్లో బాగానే రాణించామని, ఇండియాలోని సవాళ్లతో కూడిన పిచ్‌లపై ఆడామని, కాబట్టి ఇలాంటి ఓటములు ఎదురవుతూనే ఉంటాయని అన్నాడు. జట్టులోని ఎవరి సామర్థ్యాన్నీ తాను అనుమానించడం లేదని అన్నాడు. ఎక్కువగా పోస్ట్‌మార్టం చేయాలనుకోవడం లేదని చెప్పాడు. బ్యాటర్లు వారి ప్రణాళికలకు అనుగుణంగా ఆడాలని, ఒక నిర్దిష్ట పద్ధతిలో ఆడితే అది పని చేస్తుందని న్యూజిలాండ్ బ్యాటర్లు చూపించారని చెప్పారు. కివీస్ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఆడారని మెచ్చుకున్నాడు.