Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 14 December 2024
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

మన రాజ్యాంగం అనేక దేశాలకు స్ఫూర్తిదాయకం …లోకసభలో ప్రధాని మోడీ ..

రాజ్యంగంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు. ఇవి దేశం గర్వపడే క్షణాలని పేర్కొన్నారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని వేడుకగా చేసుకునే క్షణాలివి అన్నారు. ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకుంటున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్పూర్తిగా నిలిచిందన్నారు. ఎందరో మహానుభావులు కలిసి రాజ్యాంగాన్ని రచించారని.. వారందరినీ స్మరించారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదన్నారు. దేశఅధ్యక్షురాలిగా ఆదివాసీ మహిళ ఎన్నికయ్యారని ప్రధాని చెప్పారు. మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం దక్కాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ… రాజ్యాంగం మహిళలకు అన్నివిధాలుగా అండగా ఉందన్నారు. భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
రాజ్యాంగ పండుగను నిర్వహించుకోవడం గర్వకారణం అన్నారు. ఈ 75 సంవత్సరాలు చిరస్మరణీయమైవని పేర్కొన్నారు. ఇలాంటి కీలక సమయంలో పార్లమెంట్‌లో తాను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ప్రధాని మోదీ. ఈ విజయం అసాధారణమైనదిగా తెలిపారు. స్వాతంత్ర్యం సాధించిన సమయంలో భారతదేశ భవిష్యత్‌పై కలిగిన సందేహాలు, సవాళ్లను అధిగమించి.. భారత రాజ్యాంగం మనలను ఇక్కడి వరకు తీసుకువచ్చిందన్నారు. ఇది నిజంగా అద్భుత విజయం అని.. రాజ్యాంగ నిర్మాతలతో పాటు.. కోట్లాది మంది భారతీయులకు గౌరవ వందనం తెలుపుతున్నానని అన్నారు ప్రధాని మోదీ. భారతదేశం కేవలం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదని.. వేలాది సంవత్సరాల ప్రజాస్వామ్య సంప్రదాయాల కారణంగా ప్రజాస్వామ్యానికి తల్లిగా నిలిచిందన్నారు.
ప్రజల మధ్య ఐకమత్యం.., దేశాభివృద్ధిలో కీలక పాత్ర షోషిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం మనదేశ గొప్ప విధానం. బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు. కొందరు స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డాం. మన ఐక్యత దెబ్బతీసేందుకు కొందరు విషబీజాలు నాటారు. పేదలకు ఇబ్బంది లేకుండా వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డు తెచ్చాం… అని ప్రధాని మోదీ అన్నారు.