Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 01 January 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ఓటర్ కార్డు ఓటుకు గ్యారంటీ కాదు.. ఢిల్లీ ఈసీ వ్యాఖ్య!


ఓటర్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటేసే హక్కు ఉన్నట్లు కాదని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఓటర్ల జాబితాను అప్ డేట్ చేస్తున్నారు. జనవరి 1 తో పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. యువతలో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు, ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అర్హులను ఓటర్ జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మరణించిన వారి పేర్లను తొలగిస్తున్నారు.

ఇందులో భాగంగా గతేడాది ఆగస్టులో బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే నిర్వహించారని సీఈసీ వెల్లడించారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, కొత్త ఓటర్ల పేర్లను చేర్చి మొత్తంగా సవరించిన ఓటర్ల జాబితాను ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు ఢిల్లీ సీఈసీ ఆఫీసు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే తప్పుడు పత్రాలతో ఓటర్ ఐడీ పొందిన ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించింది. ఒకటి కంటే ఎక్కువ ఐడీ కార్డులు కలిగి ఉండడం కూడా శిక్షార్హమైన నేరమని పేర్కొంది. ఓటర్ కార్డు ఉందంటే ఓటేసేందుకు గ్యారంటీ కాదని తెలిపింది.