Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 03 January 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు….

  • ఫార్ములా ఈ-రేసింగ్ కేసును దర్యాఫ్తు చేస్తున్న ఏసీబీ
  • ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశం
  • దాన కిశోర్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దర్యాఫ్తు చేస్తోన్న ఏసీబీ

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ-రేసింగ్ కేసును ఏసీబీ దర్యాఫ్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 6న ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. అంటే వచ్చే సోమవారం కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ మున్సిపల్ శాఖ, ఫార్ములా ఈ-ఆపరేషన్స్ లిమిటెడ్ మధ్య జరిగిన ఒప్పందం, అందులో చోటు చేసుకున్న ఉల్లంఘనలపై అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే కేసు ఫిర్యాదుదారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ నుంచి పలు విడతలుగా సమాచారం సేకరించింది.

ఇటీవల దాన కిశోర్ ను ఏడు గంటల పాటు విచారించిన ఏసీబీ పలు వివరాలను తీసుకుంది. దాన కిశోర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాఫ్తును ముందుకు తీసుకువెళుతోంది. ఈ క్రమంలోనే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. 

ప్రాథమిక దర్యాఫ్తు క్రమంలో ఎంఏయూడీ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా, ఒప్పందంలో చోటు చేసుకున్న పలు కీలక ఉల్లంఘనలు ఉన్నట్టు ఏసీబీ భావిస్తోంది. వీటి ఆధారంగా నిందితులను విచారించే అవకాశం కనిపిస్తోంది.