Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 03 January 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

అల్లు అర్జున్ కు భారీ ఊరట… రెగ్యులర్ బెయిల్ మంజూరు…

  • సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీకి భారీ ఊరట
  • రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
  • రూ. 50 వేల రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశం

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు భారీ ఊరటను కల్పించింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. రిమాండ్ ముగిసిన నేపథ్యంలో ఇటీవల జరిగిన కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. 

అదే రోజున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. రెగ్యులర్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు అల్లు అర్జున్ కు పలు షరతులు విధించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వెల్లడించారు.