Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 01 February 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ గాంధీ ఎద్దేవా…

  • బుల్లెట్‌ గాయాలకు బ్యాండ్‌ ఎయిడ్‌ వేసినట్టుగా బ‌డ్జెట్‌ ఉందంటూ వ్యాఖ్య‌
  • ప్ర‌భుత్వ దివాళా కోరు ఆలోచనల‌కు అద్దం ప‌ట్టేలా బ‌డ్జెట్ ఉంద‌ని విమ‌ర్శ‌
  • ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా స్పందించిన రాహుల్ గాంధీ

ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర‌ బడ్జెట్‌-2025పై లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత‌, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా స్పందించారు. బడ్జెట్‌లోని సానుకూల అంశాలు, లోపాల ప్రస్తావన ఎత్తకుండా ఈ బడ్జెట్‌ “బుల్లెట్‌ గాయాలకు బ్యాండ్‌ ఎయిడ్‌ వేసినట్టుగా ఉంది” అని ఎద్దేవా చేశారు. ప్ర‌భుత్వ దివాళా కోరు ఆలోచనల‌కు అద్దం ప‌ట్టేలా ఈ బ‌డ్జెట్ ఉందంటూ ట్వీట్ చేశారు. 

“బుల్లెట్‌ గాయాలకు బ్యాండ్‌ ఎయిడ్‌ లా బడ్జెట్‌ ఉంది. ప్రస్తుతం ప్రపంచమంతా అస్థిరత నెలకొంది. ఇలాంటి సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, ప్రభుత్వం దివాళా కోరు ఆలోచనలు చేస్తోంది” అని రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. మరోవైపు ప్రధాని మోదీ బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించిన విష‌యం తెలిసిందే. దీన్ని దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల బడ్జెట్‌గా పేర్కొన్నారు.