Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 10 March 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

దాసోజు శ్రవణ్ కు ఎమ్మెల్సీ టికెట్… బీఆర్ఎస్ నిర్ణయం…

  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా దాసోజు శ్రవణ్ ను ఖరారు చేసిన కేసిఆర్
  • కాంగ్రెస్ అభ్యర్ధులుగా ఖరారైన అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు ఈరోజు చివరి రోజు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఖరారు చేసింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ఆ పార్టీ ప్రకటించింది. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధికార కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తమ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ప్రకటించగా, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ పేరును పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు.

కాగా, దాసోజు శ్రవణ్ ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 జులైలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అప్పటి ప్రభుత్వం సిఫార్సు చేసింది. కానీ సాంకేతిక కారణాలతో అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు బీఆర్ఎస్ నేతల పేర్లు పరిశీలనకు వచ్చినా శ్రవణ్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో సీనియర్ నాయకుడిగా ఉన్న శ్రవణ్ గతంలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ అధికార ప్రతినిధిగా కూడా నియమితులయ్యారు.