Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 08 May 2025
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణ నివేదిక రాష్ట్రపతికి, ప్రధానికి సమర్పణ

  • జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నగదు గుర్తింపు ఆరోపణలు
  • త్రిసభ్య కమిటీ విచారణ నివేదిక
  • ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు నివేదిక సమర్పణ?
  • తదుపరి చర్యలకు రాజ్యాంగబద్ధ ప్రక్రియకు ఆస్కారం

జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అనధికారిక నగదు లభ్యమైందన్న ఆరోపణలపై జరిగిన అంతర్గత విచారణ నివేదికను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి పంపారు. ఈ పరిణామం… సదరు జడ్జిపై ఆరోపణలు ప్రాథమికంగా విశ్వసనీయమైనవిగా కమిటీ భావించిందనే దానికి సంకేతంగా నిలుస్తోంది.

జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలోని స్టోర్ రూమ్‌లో అగ్నిమాపక చర్యల సమయంలో భారీగా నగదు బయటపడిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. ఈ నెల 3న కమిటీ తన నివేదికను సమర్పించగా, జస్టిస్ వర్మ ఈ నెల 6న తన స్పందనను అందజేశారు. ఈ రెండింటినీ సీజేఐ రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలకు పంపినట్లు సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో తెలిపింది.

అంతర్గత విచారణ ప్రక్రియ ప్రకారం, ఆరోపణలలో నిజం ఉందని కమిటీ తేల్చితే, సంబంధిత న్యాయమూర్తిని రాజీనామా చేయాలని లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలని సీజేఐ సూచిస్తారు. న్యాయమూర్తి అందుకు నిరాకరిస్తే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4), ఆర్టికల్ 218 ప్రకారం తొలగింపు ప్రక్రియతో సహా తదుపరి చర్యల కోసం సీజేఐ రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాస్తారు.

అంతకుముందు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ ప్రాథమిక నివేదిక సమర్పిస్తూ, “ఈ మొత్తం వ్యవహారంపై లోతైన దర్యాప్తు అవసరం” అని అభిప్రాయపడ్డారు. వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత, అప్పటి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వర్మను ఆయన మాతృ హైకోర్టు అయిన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. సీజేఐ ఆదేశాల మేరకు ఆయనకు ప్రస్తుతం ఎలాంటి విధులు కేటాయించడం లేదు.

కాగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన సమాధానంలో, జస్టిస్ వర్మ తాను ఎలాంటి నగదు నిల్వ చేయలేదని ఖండించారు. స్టోర్ రూమ్ సిబ్బందికి అందుబాటులో ఉంటుందని, దానికి తాళం వేసి ఉండదని తెలిపారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు తాను ఢిల్లీలో లేనని, ఎలాంటి నగదు స్వాధీనం చేసుకోలేదని పేర్కొన్నారు. తనను ఇరికించేందుకే ఈ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.