Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

గొలుసు దొంగతనాల వ్యక్తి హోటల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రాక!

గొలుసు దొంగతనాల వ్యక్తి హోటల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రాక!
-చివర్లో సినిమా స్టయిల్ లో ట్విస్ట్! హోటల్ యజమాని కటకటాల్లో
-గొలుసు దొంగతనాల్లో ఆరితేరిన ఘనులు
-ఏపీ, తెలంగాణలో 32 చోట్ల చైన్ స్నాచింగ్
-చోరీ సొమ్ముతో హోటల్ తెరిచిన నిందితులు
-ప్రారంభం రోజునే అరెస్ట్

గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ సంపాదించిన డబ్బుతో హోటల్ పెట్టిన ఓ దొంగ.. దాని ప్రారంభానికి ఏకంగా ఎమ్మెల్యేను ఆహ్వానించాడు. అనుకున్నట్టే ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వచ్చినా, హోటల్ యజమాని రాకపోవడంతో ఎమ్మెల్యే ఆరా తీశారు. విషయం తెలిసి కంగుతిన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

పోలీసులను తప్పుదారి పట్టించేందుకు బైక్‌లను దొంగతనం చేసి వాటిపై చైన్ స్నాచింగ్‌లకు పాల్పడడం సయ్యద్ బాషా, షేక్ అయూబ్‌లకు వెన్నతో పెట్టిన విద్య. ఏపీలో 32 చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడినా పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. తర్వాత వీరు హైదరాబాదుకు మకాం మార్చి, నగర శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో నాలుగు గొలుసు చోరీలకు పాల్పడ్డారు. అదే సమయంలో బైక్‌ ఒకటి పోయిందంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను గుర్తించారు.

పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. సయ్యద్ బాషా గంటల కొద్దీ జిమ్‌లో గడిపేవాడు. కొందరిని అనుచరులుగా చేసుకుని చిన్నచిన్న సెటిల్‌మెంట్లు చేసేవాడు. ఆ సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విలాసవంతంగా గడిపేవాడు. ఆరు నెలల్లోనే ఏడుసార్లు గోవాకు వెళ్లాడు. క్యాసినోలో జూదం ఆడుతూ ఒక్క రోజులోనే రూ. 3 లక్షలు పోగొట్టుకున్నాడు.

నిందితులు ఇద్దరినీ పట్టుకున్న రాచకొండ పోలీసులతోపాటు వారికి సహకరించిన మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి 226 గ్రాముల బంగారం, రూ. 1.7 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సయ్యద్ బాషా (33), షేక్ అయూబ్ (35) ఇద్దరూ కడపకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, రాచకొండ పరిధిలో 36 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. కడపకే చెందిన క్యాబ్ డ్రైవర్ షేక్ మహ్మద్ ఖలీద్ (35), పఠాన్ జాఫర్‌ఖాన్ (38), నాగొల్లు శశిధర్‌రెడ్డి (28) వీరికి సహకరిస్తున్నట్టు గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కడపలో అదుపులోకి తీసుకున్న నిందితులను హైదరాబాద్‌కు తరలించారు. కాగా, చోరీ చేసిన సొమ్ముతో హోటల్ పెట్టిన నిందితులు ప్రారంభోత్సవానికి రాకపోయే సరికి ఆరా తీసిన ఎమ్మెల్యే.. వారు గొలుసు దొంగలని తెలిసి కంగుతిన్నారు.

Related posts

పార్లమెంటు భద్రత ఉల్లంఘన కేసు.. రాజస్థాన్‌లో దొరికిన కాలిపోయిన ఫోన్ భాగాలు, నిందితుల దుస్తులు

Ram Narayana

ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధానికి 500 మంది అమ్మాయిల లేఖ

Ram Narayana

సాయం కోసం పోలీసులకు ఫోన్ చేస్తే.. వచ్చి కాల్చి చంపారు

Ram Narayana

Leave a Comment