దొంగదెబ్బ …పెట్రోల్ ,గ్యాస్ పై భారీగా పెంపు!
-ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ప్రజలపై భారానికి గ్రీన్ సిగ్నల్
-ఐదు నెలల తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
-ఏపీ, తెలంగాణల్లో ఎంత పెరిగిందంటే..
-హైదరాబాదులో లీటర్ పెట్రోల్ రూ. 109.10
-విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 110.80
-ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన ధరలు
ప్రజలు అనుకున్న విధంగానే ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్రం దొంగదెబ్బ తీసింది. ఐదురాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచకుండా ఎన్నికలు అయిపోయిన వెంటనే పంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. కేంద్రం చర్యలు పట్ల రాజకీయపక్షాలు మండిపడుతున్నాయి.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కొంతకాలం పాటు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలు అయిపోవడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలకు రెక్కలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఈ ఉదయం 6 గంటల నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.
తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు, డీజిల్ 87 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.10కి, లీటర్ డీజిల్ ధర రూ. 95.49కి చేరుకుంది.
ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ 88 పైసలు, డీజిల్ 83 పైసలు పెరిగింది. దీంలో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.80కి, డీజిల్ ధర రూ. 96.83కి చేరుకుంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.21కి, డీజిల్ రూ. 97.26కి చేరింది. రానున్న రోజుల్లో కూడా వీటి ధరలు పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఢిల్లీ, ముంబైలలో పెరిగిన ధరల వివరాలు:
ఢిల్లీ: లీటర్ పెట్రోల్ రూ. 96.21, డీజిల్ రూ. 87.47.
ముంబై: లీటర్ పెట్రోల్ రూ. 110.78, డీజిల్ రూ. 94.94.
గ్యాస్ సిలిండర్పై ఏకంగా రూ. 50 పెంపు.. నేటి నుంచే అమలులోకి!
గృహ, కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా పెంచేసిన ప్రభుత్వం
తెలంగాణ, ఏపీలో వెయ్యి దాటేసిన సిలిండర్ ధర
5 కేజీల సిలిండర్ ధర రూ. 349కి పెంపు
నేటి ఉదయం జనం ఇంకా పక్కల మీది నుంచి లేవకముందే కేంద్రం షాకిచ్చింది. వంటగ్యాస్ ధరలను భారీగా పెంచేసింది. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 50 పెంచేసింది. ఫలితంగా తెలంగాణలో సిలిండర్ రూ. 1,002కి చేరుకోగా, ఆంధ్రప్రదేశ్లో ఇది రూ. 1008గా ఉంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి.
5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 349కి పెరగ్గా, 10 కేజీల కాంపోజిట్ బాటిల్ ధర రూ. 669కి చేరింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 2033.50కి పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశంలో గ్యాస్ ధరలు పెరగడం అక్టోబరు తర్వాత ఇదే తొలిసారి.