Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ మరింత నాశనం కాకముందే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని కోరాం: చంద్రబాబు!

ఏపీ మరింత నాశనం కాకముందే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని కోరాం: చంద్రబాబు!
-టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారిపై సీబీఐ -విచారణ జరిపించాలని రాష్ట్రపతిని కోరాం
-యువత నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది
-రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేస్తున్నారు
-రాష్ట్రపతితో సమావేశం తర్వాత జగన్ పై చంద్రబాబు ఫైర్
-గంజాయి ఎక్కడ పట్టుబడినా మూలాలు ఏపీలోనే బయటపడుతున్నాయి
-నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు
-జగన్, డీజీపీ ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయి

టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై జరిగిన దాడులపై సీబీఐతో విచారణ జరిపించి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరామని చంద్రబాబు తెలిపారు. ఏపీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పినందుకే దాడులు చేశారని చెప్పారు. దాడి చేసిన వెంటనే డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పేట్రేగిపోతోందని అన్నారు.డ్రగ్స్ వల్ల రాష్ట్రంలో యువత నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన ఉందని చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలపై కూడా దాడులు చేస్తున్నారని అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైకోర్టు జడ్జీలతో పాటు ఇతర రంగాలపై దాడులు చేశారని అన్నారు. రాష్ట్ర సహజ సంపదను, వనరులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. నానాటికీ రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతోందని అన్నారు. ఏపీలో పరిస్థితులు మరింత ఘోరంగా తయారవకముందే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్రపతిని కోరామని చెప్పారు.

తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఇలా ఏ రాష్ట్రంలో గంజాయిని పట్టుకున్నా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఏపీలో 23 వేల ఎకరాల్లో గంజాయి సాగు పెద్ద ఎత్తున జరుగుతోందని అన్నారు. గుజారాత్ లోని ముంద్రా ఎయిర్ పోర్టులో 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడిందని… దీనిపై విచారణ జరిపితే చివరకు విజయవాడలోని సత్యనారాయణపురం అడ్రస్ బయటకు వచ్చిందని మండిపడ్డారు. ఏపీ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ఎగుమతి అవుతున్నాయనే విషయం బయటపడిందని చెప్పారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు సమావేశమయ్యారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రపతికి అన్ని విషయాలను వివరించామని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా దొరకని మద్యం బ్రాండ్లు ఏపీకి వచ్చాయని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్ నాసిరకం మద్యాన్ని తయారు చేయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఒకప్పుడు అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉన్న ఏపీ… ఇప్పుడు డ్రగ్స్ లో నెంబర్ వన్ గా ఉందని చెప్పారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని పలు పార్టీ కార్యాలయాలు, తమ నేత పట్టాభి నివాసంపై దాడులు చేశారని అన్నారు. ఇది సీఎం జగన్, డీజీపీ సవాంగ్ ఆధ్వర్యంలో జరిగిందని దుయ్యబట్టారు. డీజీపీ కార్యాలయం, సీఎం నివాసం సమీపంలో కూడా దాడులు జరిగాయని చెప్పారు. వైసీపీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

Related posts

ఖమ్మం అసెంబ్లీకి పోటీచేస్తా…ఏపీలోని గుడివాడకి రమ్మంటున్నారు …రేణుకాచౌదరి!

Drukpadam

హుజూరాబాద్ ఉపఎన్నిక..అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ…

Drukpadam

అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా టీకాలు పంపిణీ చేయాలంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం!

Drukpadam

Leave a Comment