Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కుప్పం సభలో జగన్ సర్కార్ పై చంద్రబాబు నిప్పులు…

భయపడి దాసోహం అంటాం అనుకున్నావా మిస్టర్ జగన్ …చంద్రబాబు నిప్పులు…
-రెండున్నరేళ్ల నుంచి తమను తిడుతున్నారని ఆగ్రహం
-కుప్పంలో సభలో జగన్ సర్కారుపై చంద్రబాబు ధ్వజం
-రెండు సంవత్సరాల నుంచి బూతులు తిట్టిస్తున్నావు
-తానెప్పుడూ బూతులు మాట్లాడలేదని వెల్లడి
-ఎవరేమిటో తెలుసుకునేందుకు ఎక్కడకు వస్తావు
-కుప్పం వస్తావా… లేక నీ పవిత్ర జెరూసలేంకు వస్తావా?: సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

-బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద స్వల్పంగా గాయపడ్డ చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు.

“ఎన్నో ఏళ్లుగా నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఇటీవల ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలిత ఉగ్రవాదం ఉందని తెలియజేశాను. నేను చేసేది ధర్మపోరాటం. ధర్మాన్ని కాపాడడం బాధ్యతగా భావిస్తాను. చోటా మోటా నాయకులు వస్తేనే లెక్కకుమిక్కిలిగా పోలీసులు వస్తారు. ఇవాళ నా సభలో ముగ్గురు పోలీసులే ఉన్నారు. ఏవండీ ఎస్సై గారూ… ఎందుకండీ మీరు కూడా ఇక్కడ!

మీ డీజీపీ ఏమో మా ఆఫీసుపై దాడి జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటారు. డీజీపీ ఆఫీసుకు దగ్గర్లోనే టీడీపీ ఆఫీసు ఉన్నా, టీడీపీ ఆఫీసుపై దాడి జరిగినా పట్టించుకోలేదు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసి టీడీపీ వారిపైనే కేసులు పెడుతున్నారు. ఇక్కడేమో ఒకాయన నాపై బాంబు వేస్తానంటున్నాడు. అలిపిరిలో నాపై 24 క్లేమోర్ బాంబులు పేల్చారు. సాక్షాత్తు వెంకటేశ్వరస్వామే కాపాడాడు నన్ను. ఇవాళ ధర్మం కోసం పోరాడే నన్ను ఈ ప్రజాదేవుళ్లే కాపాడుకుంటారు.

నా పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. నేను రాష్ట్రంలో తిరగకూడదా? నేను చేసిన తప్పేంటి? ఏమడిగాను నేను? రాష్ట్రంలో గంజాయి పండిస్తున్నారు… చర్యలు తీసుకోమని అడిగాను. గంజాయి తీసుకుంటే పిల్లలు ఏమవుతారు? ఆ మాట అడిగితే సమాధానం చెప్పరు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతున్నారు. తయారీ అంతా జగన్ దే. రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగిపోయాయి. చమురు ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి.

నాకు సభ్యత, సంస్కారం ఉంది. ఏనాడైనా నా నోట్లోంచి బూతులు వచ్చాయా? కానీ రెండున్నరేళ్ల నుంచి మమ్మల్ని బూతులు తిడుతున్నారు. ఇక్కడ పెద్దిరెడ్డి పెద్ద పుడింగి అట. ఆకాశం నుంచి ఊడిపడ్డాడట. అలాంటి వ్యక్తిని ఏమైనా మాట్లాడితే ఒకాయన భరించలేడట… నాపై బాంబు వేస్తాడట. నేను రెడీగా ఉన్నా.

రెండున్నరేళ్ల నుంచి మీరు మాట్లాడిన మాటలు, మేం మాట్లాడిన మాటలు ప్రజలు ముందు ఉంచుదాం. ప్రజలు నాది తప్పని తేల్చితే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం. మరి మీ సంగతేంటి మిస్టర్ జగన్… ఎక్కడికి వస్తావు… కుప్పం వస్తావా, పులివెందుల వస్తావా, అమరావతి వస్తావా, విశాఖ వస్తావా, తిరుపతి పవిత్ర దేవాలయానికి వస్తావా, లేకపోతే మీ పవిత్ర జెరూసలేంకు వస్తావా…?

ఏం మీరు అంటే మేం పడాలా? మీ గురించి మాట్లాడితే మా ఆఫీసులపై దాడి చేస్తారా? పోలీసులు కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారు. నీ కేసులకు భయపడి మేం నీకు దాసోహం అనాలా? నీకు భయపడి మేం పారిపోవాలా? ఒక్క చాన్స్ అంటూ అడిగితే అవకాశం ఇచ్చారు… కానీ దద్దమ్మ ప్రభుత్వం వచ్చింది” అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.

బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద స్వల్పంగా గాయపడ్డ చంద్రబాబు…

తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఉదయం స్వల్పంగా గాయపడ్డారు. కుప్పంకు వెళ్లే క్రమంలో ఈ ఉదయం ఆయన బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన కుప్పంకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు పెద్ద సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు వారు యత్నించారు.

ఈ క్రమంలో చంద్రబాబు చేతికి అనుకోకుండా స్వల్ప గాయమయింది. ఆ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి కుప్పంకు బయల్దేరి వెళ్లారు.

Related posts

ఒక రోజు ముందుగానే ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు!

Drukpadam

టీఆర్ యస్ ,బీజేపీ డ్రామాలతో రాష్ట్రానికి దక్కకుండా పోయిన ఆయుష్ వైద్య కేంద్రం…ఆరెస్పీ!

Drukpadam

బెంగాల్ సీఎంగా మూడవసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌మ‌త బెన‌ర్జీ

Drukpadam

Leave a Comment