Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజురాబాద్ లో గెలిచిన ఆత్మగౌరవం …ఓడిన అహంకారం!

హుజురాబాద్ లో గెలిచిన ఆత్మగౌరవం …ఓడిన అహంకారం!
-ప్రలోభాలకు చెంపపెట్టు …టీఆర్ యస్ ఎత్తులు చిత్తు!
దయచూపని దళిత బందు …
-దళిత బందు ప్రారంభించిన గ్రామంలోను టీఆర్ యస్ ను కనుకరించని ఓటర్లు
-కేసీఆర్ మాటలు నమ్మని హుజురాబాద్ ప్రజలు
-కేసీఆర్ పాలనకు ,మోసపు మాటలకు కాలం చెల్లిందంటున్న బీజేపీ
-బీజేపీ ప్రభావం కాదు …ఈటల వ్యక్తిగతం అంటున్న పరిశీలకులు
-కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ ఎన్నికగానే చుసిన హుజురాబాద్ ఓటర్లు

అహంకారానికి , ఆత్మ గౌరవానికి మధ్య జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఆత్మగౌరవం గెలిచింది. అహంకారం ఓడింది. ఓటర్లు ఈటల వినయవిధేయతకు పట్టం కట్టారు. హుజురాబాద్ హుజూర్ ఈటలేనని స్పష్టమైన తీర్పు నిచ్చారు . ఈ తీర్పు టీఆర్ యస్ కు చెంపపెట్టు లా మారింది.. అధికారపార్టీ అహంభావం, మోసం దగా కుట్రలతో చేసే రాజకీయాలను ప్రజలు ఎంత మాత్రం అంగీకరించరని హుజురాబాద్ ఫలితం స్పష్టం చేసింది. వందల కోట్లు ఖర్చు చేసినా ప్రజల మద్దతు కూడా గట్టటంలో టీఆర్ యస్ ఘోరంగా విఫలమైంది. ఇది టీఆర్ యస్ విఫలం కంటే కేసీఆర్ ,అహంకారం , అహంభావానికి ప్రజలు ఇచ్చిన తీర్పుగా రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.

అధికార టీఆర్ యస్ పార్టీ ఈటలను భూకబ్జా ఆరోపణలతో తన మంత్రివర్గం నుంచి బయటకు పంపిన తరువాత వేగంగా మారిన పరిణామాల్లో అనివార్యమైన పరిస్థితుల్లో ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకు ముందే టీఆర్ యస్ పార్టీ కి గుడ్ బై చెప్పిన ఈటల ఆ పార్టీ ద్వారా వచ్చిన శాసన సభ్యత్వాన్ని సైతం వదులుకొని ఉపఎన్నికకు సిద్ధమైయ్యారు. నాటి నుంచి ఈటలను ఎలాగైనా తిరిగి శాసనసభలో అడుగు పెట్టనివ్వకుండా చేయాలనీ కంకణం కట్టుకున్న కేసీఆర్ వేయని ఎత్తు చేయని ప్రయత్నాల లేవు .

అహంకారానికి ,ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఈ పోరులో టీఆర్ యస్ అనేక అడ్డదార్లు తొక్కింది.ఓటర్లను ప్రలోభాలకు గురిచేసింది. విఫరీతంగా డబ్బు పంపిణి చేసింది. పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ జరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి.కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఓట్లు రాల్చుతుందని అనుకున్న దళిత బందు దయచూపలేదు. చివరికి అట్టహాసంగా కేసీఆర్ స్వయంగా వచ్చి దళిత బందు ప్రారంభించిన గ్రామంలో సైతం ఓటర్లు టీఆర్ యస్ ను కనికరించలేదు .అక్కడ ఈటలకు ఆధిక్యత రావడం టీఆర్ యస్ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. టీఆర్ యస్ కోటల గల్లంతు అయ్యాయి. తమకు మెజార్టీ ఖాయం అనుకున్న అనేక గ్రామాల్లో ఈటలకు ఆధిక్యం రావడం గమనార్హం .

ఓటర్లను కేవలం డబ్బులకు అమ్ముడు పోయే సరుకుగా భావించిన రాజకీయనాయకులకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు . అధికార పార్టీ మాటలను, బెదిరింపులను లెక్క చేయలేదు .వందల కోట్లు ఖర్చు పెట్టిన అధికారపార్టీకి గుణపాఠం చెప్పారు. కేసీఆర్ వర్సెస్ ఈటల గా జరిగిన ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు.

గత మూడు నెలలుగా టీఆర్ యస్ అధికార యంత్రాగాన్ని ఉపయోగించి ప్రలోభాలకు గురిచేసింది. చిన్న చితక లీడర్లను గులాబీ కండువా కప్పి లోబరుచుకుంది. ప్రత్యేకించి రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు అక్కడే మకాం వేసి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశారు. కొందరికి ఎమ్మెల్సీ పదవులు ,మరికొందరికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి బుజ్జగించి టీఆర్ యస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు అనుకూలంగా ప్రచారం చేయించారు. మంత్రులు , వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఎమ్మెల్యే లు ఇక్కడే మకాం వేసి ప్రతిగడప తొక్కారు. ప్రలోభాలు పెట్టారు. ఒక రాజకీయ పార్టీ ఒక్కక్క ఓటరుకి 6 వేల రూపాయలు పంపిణి చేయగా మరో పార్టీ 1500 రూపాయలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఒక పార్టీ లక్ష 40 వేల ఓట్లకు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటలవరకు డబ్బులు పంపిణి చేశారని అంటున్నారు. అయినప్పటికీ చైతన్యవంతమైన ఓటర్లు టీఆర్ యస్ చెంప చెల్లు మనిపించారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా రాజకీయ నాయకులూ ఓటర్లను కొనుగోలు చేసే విధానానికి స్వస్తి చెప్పి ఇచ్చిన వాగ్దానాలు ,చెప్పినమాటలను నిలబెట్టుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈటల రాజేందర్ గెలుపు బీజేపీ గెలుపు ఎంతమాత్రం కాదనే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ ఈటల వ్యక్తి గత ఇమేజ్ ,గత 20 సంత్సరాలుగా ప్రజలకు చేసిన సేవలు , ఆయన వినయం ఈ ఎన్నికల్లో ప్రజల ఆయనకు అండగా నిలిచేందుకు ఉపయోగపడ్డాయి. ఇదే వరవడి బీజేపీ కి రాష్ట్రం అంత వస్తుందనే భ్రమల్లో ఉంటె పప్పులో కాలేసినట్లే అనే అభిప్రాయాలు ఉన్నాయి. హుజురాబాద్ ఎన్నిక ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది. అంతే కానీ బీజేపీ 2023 ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలో కి వస్తుందనే అభిప్రాయాలు ఆచరణ సాధ్యం అవుతాయా లేదా అనే చూడాలి మరి !

Related posts

ది క‌శ్మీర్ ‘ఫైల్స్‌’పై కేసీఆర్ విసుర్లు!

Drukpadam

రేవంత్ కన్నీరు పై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు …

Drukpadam

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు: అలంపూర్ ఎమ్మెల్యే…

Drukpadam

Leave a Comment