Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మంలో చల్లారని పాత బస్టాండ్ వివాదం…

ఖమ్మంలో చల్లారని పాత బస్టాండ్ వివాదం…
-మంత్రి వర్సెస్ పరిరక్షణ సమితి గా మారిందా ?
– పాత బస్టాండ్ పరిరక్షణ ఉద్యమానికి ,సిపిఐ ,బీజేపీ దూరం
-పాత బస్టాండ్ లోకల్ బస్టాండ్ అన్న తుమ్మల
-ఒకే పట్టణంలో రెండు బస్టాండ్ లు మైంటైన్ చేయలేమన్న ఆర్టీసీ అధికారులు
-సూర్యాపేటలో మూడు బస్టాండ్ లు ఉన్న విషయం గుర్తు చేస్తున్న పరిరక్షణ సమితి
తెలంగాణాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటైన ఖమ్మంలో 23 కోట్ల రూపాయల నిధులతో అధునాతన హంగులతో హైటెక్ బస్టాండ్ నిర్మాణం జరిగింది. ఇది నిజంగా ఖమ్మం ప్రజలకు గర్వకారణం . 7 ఎకరాల సువిశాలమైన స్థలంలో నిర్మితమైన ఈ మోడరన్ బస్టాండ్ లో 30 ప్లాట్ ఫారాలు ఉన్నాయి . అందులో ఐదు ప్లాట్ ఫారాలు కేవలం ప్రయాణికులు దిగేందుకు కేటాయించారు. అత్యంత సుందరంగా, ఆకర్షణీయంగా రంగుల హంగులతో తీర్చి దిద్ద బడిన ఈ బస్టాండ్ ఖమ్మం నగరానికి కొత్త శోభను తెచ్చింది. ఇది హర్షనీయం అని అన్ని పార్టీలు అంటున్నాయి. ఇందులో ఎవరికీ పేచీ లేదు.
కానీ పాత బస్టాండ్ ను మూసి వేస్తామని అధికారులు ప్రకటించటం వివాదానికి కారణమైంది. అంతకు ముందు కొత్త బస్టాండ్ శంకుస్థాపన సందర్భగా జరిగిన సభలో ఆనాటి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాత బస్టాండ్ ను లోకల్ బస్సు లు తిప్పేందుకు ఉపయోగిస్తామని ప్రకటించారు. కొత్త బస్టాండ్ ను హైటెక్ , డీలక్స్ , ఇంద్ర, రాజధాని, గరుడ, ఎక్స్ ప్రెస్ , సూపర్ లక్సరీ బస్సు లు తిప్పినందుకు ఉపయోగిస్తామన్నారు. కానీ నేడు పాత బస్టాండ్ నుండి అసలు ఏ విధమైన బస్సు లు నడిపే ఉద్దేశం లేదని అధికారులు ఖరాకండిగా చెప్పారు . దీంతో కొన్ని రాజకీయ పార్టీలలో అలజడి మొదలైంది. పాత బస్టాండ్ ను కోన సాగించాలి వత్తడి తేవాలని ఉద్యమం చేపట్టాయి. లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా పాత బస్టాండ్ నుంచి బస్సు లు తిప్పేందుకు సానుకూలంగా లేరనే సంకేతాలు రావడంతో ఆందోళన ఉదృతం చేయాలనీ నిర్ణయానికి వచ్చారు. పాత బస్టాండ్ పరిరక్షణ సమితిగా సిపిఎం, కాంగ్రెస్, సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ జలంగాణ జన సమితి, తెలంగాణ ఇంటి పార్టీ మరికొన్ని ప్రజా సంఘాలతో కమిటీ ఏర్పడింది. సిపిఐ , బీజేపీ పార్టీ లు ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నాయి.
పరిరక్షణ సమితి ఆధ్వరంలో పాత బస్టాండ్ పరిరక్షణకు ఉద్యమం చేపట్టారు . పాత బస్టాండ్ నుంచి బస్సు లు నడవకపోతే దానిపై ఆధారపడ్డ అనేక కుటంబాలకు జీవనోపాధి పోతుందని , ఖమ్మం నగరానికి నడిబొడ్డున పాత బస్టాండ్ ,రైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉందని , ఆస్పత్రులు , విద్యాలయాలకు అతి దగ్గరగా ఉందని దీన్ని లోకల్ బస్టాండ్ గా ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నాయి. మంత్రి పువ్వాడను కలిసేందుకు ప్రయత్నించినా ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదని పరిరక్షణ సమితి నాయకులూ అంటున్నారు. ఖమ్మం నగరంలో రెండవ బస్టాండ్ ఉంటె తప్పేంటని పరిరక్షణ సమితి వాదన . మంత్రి పరిరక్షణ సమితి నాయకులను కలిసేందుకు అయిష్టత చూపడంతో వారు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ను, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుక చౌదరిని కలిసి పాత బస్టాండ్ కనసాగించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. నామ ఈ విషయాన్నీ పెద్దల దృష్టికి తీసుకొని పోతానని చెప్పారు. మాజీ మంత్రి తుమ్మలను కలిశారు. ఆయన శంకుస్థాపన జరిగిన రోజున పాత బస్టాండ్ ను లోకల్ బస్టాండ్ గా ఉపయోగిస్తామని ప్రకటించటం జరిగిందన్నారు. దీంతో బస్టాండ్ విషయంలో మంత్రి చెబుతున్న మాటలకూ భిన్నంగా పాత బస్టాండ్ లోకల్ బస్టాండ్ గా ఉపయోగించుకునేందుకు నాడు వాగ్దానం చేయటం జరిగిందని తనను కలిసిన పరిరక్షణ సమితి నాయకులతో అన్నారు. అంతే కాకుండా తాను ఖమ్మం నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశానని , నగరంలో బైపాస్ రోడ్ ,సెంట్రల్ లైటింగ్ , డివైడర్ల ఏర్పాటు , ఐ టీ హబ్ ,రింగ్ రోడ్ ప్రతిపాదనలు ,అగ్రహారం గేట్ , సూర్యాపేట ఖమ్మం రోడ్ నాలుగు లైన్లు గా నిర్మాణ లాంటి వాటిని తానే తెచ్చానని అన్నారు. ఈ విషయాలన్నీ అజయ్ కి కోపం తెపించేవిగానే ఉన్నాయి. అసలే తనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయటమే కాకుండా తనంటే గిట్టని వాళ్ళ దగ్గరకు వెళ్లి చెప్పటం పై ఆయన పైకి చెప్పక పోయిన ఆగ్రంగా ఉన్నారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఘాటుగానే స్పందించారు. పాతబడిన పార్టీలు ,పాతరేయబడ్డ పార్టీలు చేసే ఉద్యమాలు అనడం చర్చనీయాంశం అయింది. పరిరక్షణ సమితి నాయకులూ కూడా అజయ్ పై అదే స్థాయిలో ధ్వజమెత్తారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు.మంత్రికి ఎదురు చెపితే కేసులు దాడులా?పాత బస్టాండ్ కావాలని ఆందోళన చేస్తున్నవారిపై అక్రమకేసుల అంటూ నిలదీశారు.ఆర్టీసీ ఆస్తులను కాపాడే బాధ్యత నాది ముళ్ళు కర్ర పట్టుకుని కాపలా కాస్త అంటున్న మంత్రి , ఆయన మంత్రి అయినా తరువాతనే వరంగల్ పాత బస్టాండ్ ను లీజు కు ఇచ్చిన విషయాన్నీ మరిచారా ?పక్కనే ఉన్న చిన్న పట్టణం సూర్యాపేటలో మూడు బస్టాండ్ లు ఉండగా మిమ్మలను ఎన్నికున్న నగర ప్రజలపై మీరు చూపిస్తున్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు.తుమ్మల నాడు చెప్పిన హామీని మీరు విస్మరిస్తారా ? అని అన్నారు. ఇప్పటికైనా మంత్రి పాత బస్టాండ్ కొనసాగించి ప్రజల కోరికకు అనుగుణంగా నడుచుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Related posts

అలా చేస్తే లీటర్ పెట్రోల్ రూ. 70కి, డీజిల్ రూ. 60కే ఇవ్వొచ్చు: కేటీఆర్!

Drukpadam

అమలాపురం అగ్నికి జిల్లా పేరు మార్పు కారణమా ? .. కుట్ర కోణం ఉందా??

Drukpadam

ఇది ఎవరికీ భయపడి తీసుకున్న నిర్ణయం కాదు: మంత్రి బొత్స!

Drukpadam

Leave a Comment