ఏపీ ఎన్నికల పై స్టే రద్దు…ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దు
-రేపు ఉదయం పరిషత్ ఎన్నికలు
-కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు
-సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు రద్దు
-చట్టబద్ధంగా ఎక్కడ నాలుగువారాల నిభందనలులేవు
ఏపీ ఎన్నికలపై హైకోర్టు సింగల్ బెంచ్ ఇచ్చిన స్టే ను రద్దుచేస్తూ ఎన్నికలు జరుపుకోవచ్చు అంటూ తీర్పు ఇచ్చింది . అయితే ఫలితాలు మాత్రం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రకటించవద్దని తీర్పులో కోర్ట్ పేర్కొన్నది . దీనికి సంబందించిన సింగిల్ బెంచ్ తీర్పులో ఉన్న అభ్యంతరాలను అక్కడే పరిష్కరించుకోవాలని కోరింది. ఈ తీర్పుతో ఎన్నికల ఉత్కంఠతకు తెరదించినట్లైంది . రేపు యధావిధిగా ఎన్నికలు జరిపేందుకు ఎన్నికలసంగం ఆగమేఘాలమీద ఉత్తర్వులు జారీచేసింది. అన్నిజిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై హైకోర్టు లో ఈ రోజు వాడి వేడి వాదనలు జరిగాయి. ఇప్పటికే నామినేషన్లు వేసి ప్రచారం చేసుకొని , పోలింగ్ కు సిద్ధపడుతుండగా ఎన్నికలపై స్టే విధించడం పై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. దీనిపై ఎన్నికల సంఘం సింగిల్ బెంచ్ తీర్పు పై అభ్యతరం వ్యక్తం చేస్తూ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది. టీడీపీ నేత వర్ల రామయ్య పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదని, వ్యక్తిగత హోదాలో ఆయన వేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి కొట్టేసి ఉండాల్సిందని ఎస్ఈసీ తరపున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి కోర్టుకు తెలిపారు. అలాగే, 4 వారాల ముందే ఎన్నికల ప్రవర్తనా నియమావళి విధించాలనే చట్టబద్ధ నిబంధన లేదని చెప్పారు.
ఎన్నికల కోడ్ అమలు విషయంలో విచక్షణాధికారం ఎస్ఈసీకే ఉంటుందని ఆయన చెప్పారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అయితే, ఎస్ఈసీ చెబుతోన్న పలు అంశాలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన పత్రాలతో తమ ముందుకు రావాలని ఆదేశించింది. హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద ఎన్నికల కోడ్కు సంబంధించిన వాదనలు వినిపించారా? అని ప్రశ్నించింది. అయితే, వాదనకు సమయం సరిపోలేదని ఎస్ఈసీ తరఫు న్యాయవాది డివిజన్ బెంచ్ కు తెలిపారు. ఈ అంశాలపై ప్రతివాదుల తరఫున వాదనలు కొనసాగుతున్నాయి. పైగా ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలను జరిపేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైందని అన్నారు. దీనిపై కోర్ట్ ఇచ్చిన తీర్పు తో విపక్షాలు కంగు తిన్నాయి. రేపు జరగనున్న ఎన్నికలకోసం యధావిధిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 513 జడ్పీటీసీ లకు , 7230 ఎంపీటీసీ లకు ఎన్నికలు జరగాల్సివుంది. వీటి కోసం జడ్పీటీసీలలో 2092 , ౧౯౦౦౨ ఎంపీటీసీలలో నామినేషన్లు వేశారు. 2 కోట్ల 82 లక్షల ,15 వేల 104 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది.