Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అక్రమ మైనింగ్ పై కఠినచర్యలు …దిశాకమిటీ సమావేశంలో ఎంపీ నామ..

అక్రమ మైనింగ్ పై కఠినచర్యలు …దిశాకమిటీ సమావేశంలో ఎంపీ నామ..
-జిల్లాలో యువపారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి
-విద్య, వైద్యరంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి
-జిల్లాలో సమస్యలు ఉంటె తనదృష్టికి తీసుకురావాలన్న ఎంపీ నామ
-సమావేశంలో పాల్గొన్న జిల్లా మంత్రి ,ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యేలు ,జడ్పీ చైర్మన్

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం డిపిఆర్సీ భవన సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షక కమిటీ (దిశ) సమావేశం జరిగింది. సమావేశంలో ఎంపీ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారులు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, పరిశ్రమలు, విద్యుత్, మునిసిపాలిటీలు, రైల్వే, స్వచ్ఛ భారత్, మైన్స్, గ్రామీణాభివృద్ధి, బీఎస్ఎన్ఎల్, వైద్యం, వ్యవసాయం, స్త్రీ-శిశు సంక్షేమ, పంచాయతీ రాజ్, హౌజింగ్, పోస్టాఫీసు, పౌరసరఫరాలు తదితర శాఖల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా నామా  మాట్లాడుతూ, జిల్లాలో చేపడుతున్న రహదారుల విస్తరణ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఖమ్మం-దేవరాంపల్లి, ఖమ్మం-సూర్యాపేట, ఖమ్మం-కోదాడ, నాగపూర్-విజయవాడ రహదారుల విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఖమ్మం-సూర్యాపేట రహదారి విస్తరణ పనులు 93 శాతం పూర్తయినట్లు, అక్టోబర్ మొదటివారంలో రహదారిపై రాకపోకలకు అనుమతికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇట్టి రహదారిలో ప్రారంభం, అంతిమ ప్రదేశాల్లో సమస్యలు ఉన్నట్లు, ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఎక్కడ అండర్ పాస్ లు అవసరముందో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే రోడ్ల విస్తరణకు ప్రతిపాదనల ఆమోదానికి చర్యలు తీసుకోవాలన్నారు. కమిటీ నేషనల్ హైవే పనుల క్షేత్ర పరిశీలనకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ఏ ఏ పరిశ్రమల స్థాపనకు అవకాశాలు ఉన్నాయో మ్యాపింగ్ చేసి, అట్టి పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. రైల్వే శాఖచే చేపడుతున్న పనుల సమస్యలపై రైల్వే ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వచ్చ భారత్ క్రింద 2014 కు ముందే 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేసి, ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటించుకున్నట్లు వారు తెలిపారు. ఇప్పుడు మిగిలిన వారు ఉంటే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 12 వేలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పీఎంఇజిపి క్రింద గత సంవత్సరం లక్ష్యానికి మించి లబ్ధిదారులకు పథకం అందించినట్లు, ఈ సంవత్సరం లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లు వారు అన్నారు. మాతృ, శిశు మరణాల నియంత్రణకై చర్యలు చేపట్టాలన్నారు. వైద్య, ఆరోగ్యానికి సంబంధించి 9 ఇండికేటర్ల లక్ష్య సాధనలో జిల్లా, రాష్ట్రంలో 4వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో మార్కెట్లలో 100 శాతం ఈ-నామ్ ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నట్లు వారు తెలిపారు. గత సంవత్సరం డిమాండ్ మేరకు 212 క్రొత్త పోస్టాఫీసులు వివిధ ప్రదేశాల్లో తెరచినట్లు, ఈ సంవత్సరం ఇప్పటికి 2 చోట్ల క్రొత్త పోస్టాఫీసులు ప్రారంభించినట్లు వారు అన్నారు. సుకన్య సమృద్ధి యోజన పథక ప్రమోషన్ కోసం ప్రతి గ్రామంలో ప్రచారం చేపట్టాలన్నారు. అక్రమ మైనింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టి, వినూత్న మార్పులు తెస్తుందని, అన్ని విధాలుగా మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. కేంద్ర పథకాల విషయంలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు.

 

సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలు 43 వరకు వివిధ శాఖల ద్వారా అమలవుతున్నాయన్నారు. అన్ని పథకాల్లో లక్ష్యం మేరకు ప్రగతి సాధిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పథక లక్ష్య సాధనకు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో ఖమ్మంలో 7, మధిర, సత్తుపల్లి లలో ఒక్కో బస్తీ దవాఖానాలు మంజూరు అయినట్లు, వాటి ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, రహదారుల విస్తరణ పనులు ప్రజలకు మెరుగ్గా అందించాలన్నారు. ఖమ్మం-సత్తుపల్లి రహదారి ప్రమాదకరంగా ఉన్నట్లు, ఇట్టి రహదారిని 4 వరసల రహదారిగా మార్చాలన్నారు. ఖమ్మం-సూర్యాపేట రహదారిలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు వీటిని పరిష్కరించాలన్నారు. నామ సూచికలు ప్రాపర్ గా ఏర్పాటు చేయాలన్నారు. భూమి విలువ పెరుగుతున్నది కాబట్టి, ఆక్రమణ తొలగింపు యుద్ధప్రాతిపదికన చేయాలన్నారు. నిరుపయోగంగా ఉన్న భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, ఖమ్మం-తల్లాడ రహదారిపై ప్రమాదాలు చాలా జరుగుతున్నాయని 4 వరసల రహదారిగా విస్తరించాలన్నారు. మునిసిపాలిటీల్లో 4 వరసల రహదారులు చేసి, సెంట్రల్ లైటింగ్ చేపట్టాలని అన్నారు. సమస్యల్ని ప్రజాపక్షంగా పరిష్కరించాలన్నారు. చెరువుల్లో పూడిక మట్టి రహదారుల విస్తరణలో ఉపయోగించేలా యోచన చేయాలన్నారు. మండల పరిషత్ సమావేశాల్లో ఎఇ లను పంపాలన్నారు.
సమావేశంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ, తనికెళ్ల-సిరిపురం రహదారిలో, పల్లిపాడు టర్కింగ్ వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు విస్తరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వైరా మునిసిపాలిటీ రోడ్డు కిరువైపుల డ్రయినేజీ సమస్య పరిష్కారించాలన్నారు. గ్రీన్ ఫీల్డ్ రహదారి లో ఏమాత్రం పురోగతి లేదని, వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

అంతకుముందు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆ 19 చోట్ల… గెలిచిన టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Drukpadam

చనిపోయాడనుకున్న కొడుకు 15 సంవత్సరాల తర్వాత తిరిగొచ్చాడు… !

Drukpadam

అడవి శేష్ కు మామిడికాయలు పంపించిన ప్రకాశ్ రాజ్….

Drukpadam

Leave a Comment