Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆక్సిజన్ అందించటంలో నిర్లక్ష్యం పై ఢిల్లీ హైకోర్టు సీరియస్

ఆక్సిజన్ అందించటంలో నిర్లక్ష్యం పై ఢిల్లీ హైకోర్టు సీరియస్
కేంద్ర ప్రభుత్వానికి అక్షింతలు …
ప్రజల ప్రాణాలకన్నా ఏది ఎక్కువ కాదన్న న్యాయస్థానం ‌
ఆక్సిజన్‌ కొరతపై విచారణ జరిపిన కోర్టు
కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డ న్యాయస్థానం
నిన్నటి నుంచి ఏం చేస్తున్నారని నిలదీత
ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు ఎంతదూరమైనా వెళ్లాలని హితవు
అవసరమైతే పరిశ్రమల ఆక్సిజన్‌ మొత్తాన్ని తరలించాలని సూచన
ఆక్సిజన్‌ కొరతపై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో వాడీవేడి వాదనలు నడిచాయి. న్యాయస్థానం మరోసారి కేంద్రానికి మొట్టికాయలు వేసింది. నిన్నటి ఆదేశాలు ఇప్పటికీ అమల్లోకి రాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఒక రోజు మొత్తం ఏం చేశారని నిలదీసింది. ప్రజల జీవించే హక్కును కాలరాసే అధికారం ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించింది. ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. ‘‘ఆక్సిజన్‌ కొరత విషయంలో ప్రభుత్వం వాస్తవికతను ఎలా విస్మరిస్తుంది? ఆక్సిజన్ లేని కారణంగా మరణాలు సంభవించకూడదు. ఇలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తాయంటే.. ప్రజల ప్రాణాలపై సర్కార్‌కు ఏమాత్రం పట్టింపు లేనట్టే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మ్యాక్స్‌ హాస్పిటల్స్ వేసిన పిటిషన్‌ను విచారిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యాజ్యంపై కేంద్రం విస్మయం వ్యక్తం చేయగా.. కోర్టు మొట్టికాయలు వేసింది. ‘‘పిటిషన్‌ను చూసి ఆశ్చర్యపోవద్దు. మీకు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసి ఉండాలి. పెట్రోలియం, ఉక్కు పరిశ్రమలు ఆక్సిజన్‌ను ఇంకా వినియోగించుకుంటున్నాయని నిన్ననే చెప్పాం. ఏం చేశారు?’’ అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందిస్తూ.. ఈ విషయంపై దస్త్రాలు కదులుతున్నాయని తెలిపింది.

ఈ సమాధానంపై కోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. ‘‘మరి ఫలితం ఏంటి? దస్త్రాల కదలికలు మాకు అనవసరం. పరిశ్రమలు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం అధీనంలో పెట్రోలియం కంపెనీలున్నాయి. వాయుసేన ఉంది. నిన్న మేం అనేక ఆదేశాలు ఇచ్చాం. ఈరోజంతా ఏం చేశారు?’’ అని కోర్టు కేంద్రాన్ని నిలదీసింది. సరిపడా ఆక్సిజన్‌ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా చేసి పౌరుల జీవించే హక్కును కాపాడాలని ఆదేశించింది. అవసరమైతే పరిశ్రమల్లో ఉన్న ఆక్సిజన్‌ మొత్తాన్ని మెడికల్‌ ఆక్సిజన్‌గా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

 

ఆంధ్రా లో ఫీజుల గోల … తెలంగాణాలో 600 మంది ఎస్ బి ఐ సిబ్బందికి కరోనా

కరోనా పేషెంట్ల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే చర్యలు : ఏపీ మంత్రి బుగ్గన
కరోనాను కట్టడి చేసిన జిల్లాగా కర్నూలు నిలిచింది
ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా కమిటీని ఏర్పాటు చేశాం
ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం
కర్నూలు జిల్లాలో కరోనా కట్టడిపై ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా పేషెంట్ల నుంచి ప్రైవేటు ఆసుపత్రులు అధిక మొత్తంలో వసూలు చేయడం సరికాదని ఆయన అన్నారు. కరోనాను సమర్థవంతంగా కట్టడి చేసిన జిల్లాగా కర్నూలు నిలిచిందని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. అధిక ఛార్జీలు వసూలు చేసినట్టు సమాచారం అందగానే కమిటీ స్పందించి, సంబంధిత ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

తెలంగాణలో 600 మంది ఎస్‌బీఐ ఉద్యోగులకు కరోనా
నేటి నుంచి ఈ నెల 30 వరకు సగం మందితోనే విధులు
ఖాతాదారులతో నేరుగా సంబంధాలున్న వారికే కొవిడ్
సిబ్బంది కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్
కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తిలో తెలంగాణలో 600 మంది భారతీయ స్టేట్ బ్యాంకు ఉద్యోగులు వైరస్ బారినపడ్డారు. ఈ మేరకు ఆ బ్యాంకు సీజీఎం ఓపీ మిశ్రా తెలిపారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులు కొవిడ్-19 బారినపడుతున్నారని పేర్కొన్నారు. వైరస్ బారిన మరింతమంది ఉద్యోగులు పడకుండా చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు బ్యాంకులో సగం మంది ఉద్యోగులే విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని, హైదరాబాద్‌లోని కోఠి, సికింద్రాబాద్‌లోని బ్యాంకు కార్యాలయాల్లోని సిబ్బంది కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేస్తామని మిశ్రా వివరించారు.

 

 

Related posts

నాది ఇప్పుడు ఇండియా.. బెయిలుపై బయటకొచ్చిన పాక్ మహిళ భావోద్వేగం

Drukpadam

చంద్రబాబును విచారించే తొమ్మిది మంది సీఐడీ అధికారులు వీరే!

Ram Narayana

పాన్ – ఆధార్ లింక్ చేసుకోకుంటే పడే జరిమానాలు ఇవే..!

Drukpadam

Leave a Comment