మహారాష్ట్రలో ఆసుపత్రి ఐసీయూలో మంటలు.. 13 మంది సజీవ దహనం
- ఐసీయూలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్
- ఘటన సమయంలో ఐసీయూలో 17 మంది రోగులు
- రెండు గంటలు శ్రమించి మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
![Fire at Vijay Vallabh Hospital in Virar leaves 12 Covid patients dead](https://i0.wp.com/img.ap7am.info/telugu-news/images-big/cr-tn-60822cf4c88d5.jpg?resize=320%2C213&ssl=1)
కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. పాల్ఘర్ జిల్లా విరార్లోని విజయ్ వల్లభ్ ఆసుపత్రి ఐసీయూలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు 13 మంది కరోనా రోగుల ప్రాణాలు హరించాయి. ఈ తెల్లవారుజామున 3.15 గంటలకు ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి 5.30 గంటలకు మంటలను అదుపు చేశారు. ఐసీయూలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు.
ఘటన సమయంలో ఐసీయూలో 17 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. మిగతా వారిని ఆసుపత్రి నుంచి తరలించారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. నాసిక్లోని డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ కారణంగా సరిపడా ఆక్సిజన్ అందకపోవడంతో 22 మంది రోగులు మృత్యువాత పడ్డారు. ఆ తర్వాతి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.