Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

కర్ణాటకలో ఇద్దరు మహిళా ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల మధ్య రచ్చ…

రాష్ట్రంలో చాలామంది జీవితాలు ఆమె వల్లే నాశనమయ్యాయి.. ఐఏఎస్ రోహిణిపై ఐపీఎస్ రూప సంచలన ఆరోపణలు

  • కర్ణాటకలో ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ వివాదం
  • రోహిణి అవినీతిపై దృష్టి పెట్టాలని మీడియాకు రూప విజ్ఞప్తి
  • బదిలీ వేటు పడ్డా సరే మరోమారు ఆరోపణలు
  • రూపకు పరువు నష్టం నోటీసులు పంపిన రోహిణి

కర్ణాటకలో ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ వివాదం మరింత హీటెక్కింది. వ్యక్తిగత ఆరోపణలతో రచ్చకెక్కిన ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూపా మౌద్గిల్ లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసింది. అయినప్పటికీ ఐపీఎస్ ఆఫీసర్ తగ్గడంలేదు. తాజాగా గురువారం రోహిణిపై రూప మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో చాలామంది జీవితాలు నాశనం కావడానికి రోహిణి కారణమయ్యారని ఆరోపించారు.

అలాంటి మహిళను నిలదీయాల్సిందేనని మరోమారు నోరు పారేసుకున్నారు. ఇప్పటికే ఒక ఐఏఎస్, మరో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని, మరో ఐపీఎస్ అధికారుల జంట విడాకులు తీసుకుందని రూప చెప్పారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే ఈ పోరాటం చేస్తున్నానని సమర్థించుకున్నారు. రోహిణీ సింధూరి అవినీతిపై దృష్టి పెట్టాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. 

తన వివాహ జీవితంపై జరుగుతున్న ప్రచారాన్ని రూపా మౌద్గిల్ ఖండించారు. భర్తతో కలిసే ఉన్నానని, తమపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. బాధితుల తరఫున తాను పోరాడుతున్నానని, తాను ధైర్యవంతురాలినని స్పష్టం చేశారు. రోహిణి, రూపల మధ్య వివాదం నేపథ్యంలో ఇద్దరిపైనా వేటు వేసిన చీఫ్ సెక్రటరీ.. సోషల్ మీడియాలో రచ్చ వద్దని, పోస్టులు పెట్టొద్దని హెచ్చరించారు. అయినప్పటికీ రూపా మౌద్గిల్ వినిపించుకోలేదు. రోహిణి సింధూరిపై సోషల్ మీడియా వేదికగా మళ్లీ ఆరోపణలు గుప్పించారు.

రూపకు లీగల్ నోటీసులు..

సోషల్ మీడియాలో రూపా మౌద్గిల్ పెట్టిన పోస్టులతో తన పరువుకు భంగం కలిగిందంటూ ఐఏఎస్ రోహిణి సింధూరీ కోర్టుకెక్కారు. రూపకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తన పరువుకు భంగం కలిగించినందుకు, మానసికంగా వేధింపులకు గురిచేసినందుకు పరిహారంగా రూ.కోటి చెల్లించాలని, 24 గంటల్లో లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొన్నారు.

రూ.కోటి చెల్లించాలి.. క్షమాపణ చెప్పాలి: కర్ణాటక ఐఏఎస్ అధికారిణి డిమాండ్

Amid bitter tussle over pics IAS officer Rohini seeks Rs 1 cr compensation unconditional apology from IPS officer Roopa

కర్ణాటకలో ఇద్దరు ఉన్నతాధికారిణుల మధ్య ఏర్పడిన వివాదం మరింత ముదిరింది. ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి సీనియర్ ఐఏఎస్ అధికారులకు తన వ్యక్తిగత ఫొటోలను (అవాంఛిత) పంపినట్టు ఐపీఎస్ అధికారి అయిన రూప మౌద్గిల్ ఆరోపించడం తెలిసిందే. దీంతో రూపపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని రోహిణి ఇప్పటికే కోరారు. తాజాగా తనపై చేసిన వ్యాఖ్యలకు గాను నష్టపరిహారం కింద రూ.కోటి చెల్లించాలని, క్షమాపణ చెప్పాలంటూ రూప మౌద్గిల్ కు రోహిణి సింధూరి లీగల్ నోటీసులు పంపించారు.

ప్రతిష్టకు జరిగిన నష్టం, మానసిక వేదనకు గాను ఈ మొత్తం చెల్లించాలని రోహిణి డిమాండ్ చేశారు. ఫేస్ బుక్ లో రోహిణికి వ్యతిరేకంగా రూప మౌద్గిల్ పోస్ట్ పెట్టడం, అవినీతి సహా 19 ఆరోపణలు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. తన షరతులను అమలు చేయకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని రోహిణి సింధూరి హెచ్చరించారు. తన ఫొటోలను సీనియర్ ఐఏఎస్ అధికారులకు పంపించడం ద్వారా సర్వీస్ నిబంధనలను రోహిణి ఉల్లంఘించారన్నది రూప మౌద్గిల్ ఆరోపణగా ఉంది.

‘‘మీరు చేసిన వ్యాఖ్యలు/ప్రకటనలు/ఆరోపణలు నా క్లయింట్, ఆమె కుటుంబ సభ్యులను ఎంతో మానసిక వేదనకు గురి చేశాయి. వృత్తి పరంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా ఆమె ప్రతిష్టను దెబ్బతీశాయి. వీటి కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆమె నిజాయితీ, ప్రవర్తన చర్చనీయాంశంగా మారాయి. నా క్లయింట్ పేరు, ప్రతిష్టలకు జరిగిన నష్టాన్ని కరెన్సీ రూపంలో కొలవలేము. అయినప్పటికీ దీన్ని కోటి రూపాయలకు పరిమితం చేస్తున్నాం. నష్ట పరిహారం కింద ఈ మొత్తాన్ని మీరు నా క్లయింట్ కు చెల్లించాలి’’ అని రూప మౌద్గిల్ కు పంపిన నోటీసులో పేర్కొన్నారు.

అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని, రోహిణి సింధూరి అవినీతిపై మీడియా దృష్టి సారించాలంటూ రూప మౌద్గిల్ పిలుపునివ్వడం గమనార్హం. అంతేకాదు తీవ్ర పదజాలంతో కూడిన పెద్ద పోస్ట్ ను ఫేస్ బుక్ లో పెట్టారు. వీరి ఆరోపణలతో సీఎం బస్వరాజ్ బొమ్మై జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఈ నెల 21న వీరిద్దరినీ ఏ పోస్ట్ కేటాయించకుండా కర్ణాటక సర్కారు బదిలీ చేయడం గమనార్హం.

Related posts

పార్లమెంట్ లో రాహుల్ ప్రసంగాలపై ప్రజల ఆసక్తి…!

Ram Narayana

రాజస్థాన్ లో కొత్త పార్టీ లేనట్లే.. ఎలాంటి ప్రకటన చేయని సచిన్ పైలట్

Drukpadam

దూకుడు పెంచిన కేసీఆర్.. మహారాష్ట్రకు పయనం.. షెడ్యూల్ ఇలా!

Ram Narayana

Leave a Comment