బహుముఖ ప్రజ్ఞాశాలి ,ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ చేకూరి కాశయ్య ఇకలేరు….
-జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం
-పీవీకి ,చెన్నారెడ్డకి అత్యంత సన్నిహితులు
-విమద్ లాల్ కమిషన్ ఏర్పాటులో కీలక పాత్ర
-గురుదక్షణ ఫౌండేషన్ ఏర్పాటు
ఖమ్మం జిల్లా ఎన్సైక్లోపీడియా చేకూరి కాశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి ,ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ ,గొప్ప రాజనీతిజ్జుడు , ప్రముఖ గాంధేయవాది చేకూరి కాశయ్య ఇకలేరు అనే మరణవార్త ఖమ్మం జిల్లా ప్రజలను కలిచి వేసింది. ఆయన అనారోగ్యంతో చాల కాలంగా ఆయన ఖమ్మం లోనే ఉంటున్నారు. క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాదులో చికిత్స పొందుతున్న కాశయ్య సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మృతదేహాన్నిఖమ్మం తీసుకోని వచ్చారు. ఆయనకు ఇద్దరు కుమారులు , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకట్ దగ్గరే ఆయన ఉండి చికిత్స తీసుకున్నారు. అంతకుముందు కొన్ని సంవత్సరాలపాటు బైపాస్ రోడ్ లోని ఆర్ ఆర్ స్కూల్ లో పైఅంతస్తులో నివాసం ఉండేవారు. పిల్లల ఖాళీ సమయంలో వారితో గడపటం ఆయనకు ఇష్టం . ప్రతి పిల్ల వాణ్ణి పలకరించడం , చాక్ లెట్స్ ఇవ్వడం , ఎవరైనా పేద విద్యార్థులకు సహాయం చేయడం లాంటి ఉన్నత విలువలను పాటించారు . కొంతకాలం క్రితం ఆయన నారాయణ తో కలిసి , గురుదత్త ఫాండషన్ ఏర్పాటు చేసి అక్కడే చాలాకాలం నివాసం ఉన్నారు. దాన్ని పెద్ద ప్రకృతి వైద్యశాలగా మార్చాలని ఆయన కళలు గన్నారు. అందుకు అనుగుణంగా అనేక మెడికేటెడ్ మొక్కలను సేకరించి అక్కడ వేయించారు. గొప్ప రాజనీతిజ్జుడైన కాశయ్యకు , విజ్ఞానఖనిగా ఆయనకు పేరుంది. మాజీ ప్రధాని దివగంత పీవీ కి సన్నిహితుడుగా పేరొందారు. పీవీ ఖమ్మం ఎప్పడు వచ్చిన చేకూరి కాశయ్య పేరు ప్రస్తావించకుండా వారిని గురించి వాకబు చేయకుండా ఉండేవారు కాదు . ప్రధానిగా ఉన్న సమయంలో ఖమ్మం సభలో పీవీ ప్రసంగిస్తూ చేకూరి కాశయ్య , మహమ్మద్ రజబ్ అలీ పేర్లను ప్రస్తావించటం గమనార్హం . ప్రధానిగా ఉండగా ఢిల్లీ వెళ్లి పీవీని కలిసిన సందర్భాలు అనేకం . రాష్ట్రలో అనేక మంది ముఖ్యమంత్రిలను నేరుగా కలిసి వారితో మాట్లాడిన కాశయ్య ఏనాడూ తనకు వారు తెలుసు వీరు తెలుసు అనే దర్పం ప్రదర్శించలేదు. ఎవరికి ఏ
ఆపదవచ్చి ఆయన దగ్గరకు వెళ్ళితే కచ్చితంగా పరిష్కరించటమో లేదా మార్గం చూపడం జరిగేది. జిల్లాలోని రాజకీయనాయకులకు ఏ సందేహం ఉన్న అయన నుంచి తెలుసుకునేవారు. రెండు సార్లు కొత్తగూడం శాసనసభ్యుడిగా , కాంగ్రెస్ నుంచి 1972 లో ,జనతా పార్టీ నుంచి 1978 లో ఎన్నికయ్యారు . తెలంగాణ ప్రజాసమితి నుంచి ఆయన ఖమ్మం ఎంపీ గా కూడా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి కాంతమ్మ చేతిలో కేవలం 10 స్వల్ప తేడాతో ఓడిపోయారు. పులిగుండాల ప్రాజక్టు అవినీతిపై ఆయన పోరాటం చేయడం అప్పట్లో మరో సంచలనం . ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆయన సేవలు అందించారు. అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు కు వ్యతిరేకంగా విమద్ లాల్ కమిషన్ ఏర్పాటు చేయించి దానిముందు హాజరై చెప్పిన సాక్ష్యం చెప్పడం పెనుసంచలనం . విమద్ లాల్ కమిషన్ కార్యాలయం బొంబాయి లో ఉండేది . అక్కడకు వెళ్లేందుకు ఆయన దగ్గర డబ్బులు లేకపోతె స్నేహితులు టికేట్స్ కొని ఇచ్చేవారు. విద్యార్ధి దశనుంచే రాజకీయాలపట్ల ఆశక్తి ఉన్న కాశయ్య చెన్నారెడ్డి లాంటి వారితో కలిసి పనిచేశారు. వివిధ ప్రాంతాలలో ఉన్న ఖమ్మం జిల్లా ప్రముఖులను ఖమ్మంకు పిలిచి సన్మానం చేయించి వారికీ జిల్లా పట్ల మరింత ప్రేమ కలిగేలా చేశారు. ఖమ్మం లో కమ్మ వారికల్యాణ మండప నిర్మాణంలో ,సామాజికవర్గానికి పెద్దదిక్కుగా విద్యార్థులకు హాస్టల్ ఏర్పాటులో ఆయన కృషి అమోఘం .
కాశయ్య గారి మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం..
మాజీ శాసనసభ్యుడు, గురుదక్షిణ ఫౌండేషన్ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వడ అజయ్ కుమార్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రూరల్ మండలం పోలేపల్లిలోని గురుదక్షిణ ఫౌండేషన్ ఆవరణంలో ఉంచిన వారి భౌతికాయన్ని మంత్రి పువ్వడ సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
రాజకీయలలొ విలువలు సాంప్రదాయాలు కడదాక పాటించిన ఓ బాటసారి తన ప్రయాణాన్ని ముగించి మన మధ్య నుండి వెళ్లిపోవడం బాధాకరమన్నారు.
వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుబూతుని వ్యక్తం చేశారు. వారి పరమపవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్న అని అన్నారు
కాశయ్య మరణంతో రాజనీతిజ్ఞుడిని కోల్పోయిన రాష్ట్రం
ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య మృతితో రాష్ట్రం ఒక రాజీనీతిజ్ఞడిని కోల్పోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కాశయ్యగారికి చెరగని ముద్ర. స్వాతంత్ర సమరయోధుడిగా.. నిస్వార్థ రాజకీయ నేతగా భవిష్యత్ తరాలకు ఆయన మార్గదర్శిగా విలువలతో జీవితాన్ని సాగించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1978లో ఆయన కొత్తగూడెం స్థానం నుంచి గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ అయినా.. ఎమ్మెల్యే అయినా.. కాశయ్యగారు ఏనాడు ఆడంబరాలకు, అతిశయలకు వెళ్లలేదు. నిరాడంబర జీవితానికి కాశయ్యగారు పెట్టిందిపేరు. అజాతశతృవుగా జిల్లాలో ఆయనను అన్ని పార్టీల నాయకులు పిలుస్తారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నా.. నిజాయితీగానే జీవించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం తక్కెళ్లపాడు గ్రామంలో కాశయ్యగారు జన్మించారు. స్వతంత్ర పోరాట సమయంలో జాతిపిత మహాత్మాగాంధీ గారు 1946లో ఒక సభలో ప్రసంగించేందుకు ఖమ్మం జిల్లాకు వచ్చారు. మహాత్ముడి మాటలు వినేందుకు సభకు వచ్చిన కాశయ్యగారు… తరువాత కాలంలో గాంధీ మాటలే నా జీవితాన్ని మలుపు తిప్పాయని ఆయన పదేపదే చెప్పుకునేవారు. స్వతంత్రపోరాటయోధుడు.. తొలితరం రాజకీయ నాయకుడు.. నిస్వార్థ సేవకుడు, ప్రజాసేవ పరమావధిగా భావించే కాశయ్యగారు మన దగ్గర నుంచి భౌతికంగా వెళ్లిపోవడం అత్యంత దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా..
పువ్వాడ నాగేశ్వరరావు సిపిఐ
చేకూరి కాశయ్య కు సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరావు నివ్వాళ్ళు అర్పించారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానిభూతిని తెలియజేసారు.ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ కాశయ్య మృతి తో రాజకీయ ధరందరుడ్ని నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడిని కోల్పోయామన్నారు.మేము వేరు వేరు రాజకీయ భావాలతో వున్నా మంచి స్నేహితులు గా ఉన్నామన్నారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కాశయ్య గారి సేవలు మరువలేనివన్నారు. మంచి వక్త గా ప్రజాప్రతినిధి గా కాశయ్య జిల్లా పై తనదైన ముద్రవేశారని, చెరగని సంతకం చేశారని పువ్వాడ పేర్కొన్నారు
వనమా సంతాపం ….కొత్తగూడెం ఎమ్మెల్యే
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు నా అశ్రు నయనాలతో బాధాతప్త హృదయం తో తెలియచేయునది ఏమనగా గౌరవనీయులు మాజీ కొత్తగూడెం శాసనసభ్యులు మరియు ఉమ్మడి జిల్లా జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ చేకూరి కాశయ్య గారు గత అర్ధరాత్రి గుండెపోటు తో మరణించారు ఈ రోజు అనగా మంగళవారం వారి పార్థివ దేహానికి ఖమ్మం పట్టణం లో అంత్యక్రియలు నిర్వహింహాబడును భగవంతుడు వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలని సంతాపం ప్రకటించారు.
మాజీ ఎమ్మెల్యే కొండబాల సంతాపం
మధిర మాజీ శాసనసభ్యుడు , కాశయ్యకు అంత్యంత సన్నిహితుడు కొండబాల కోటేశ్వరరావు కాశయ్య మృతిపట్ల తీవ్రసంతాపం ప్రకటించారు. జిల్లాకు ఆయన చేసిన సేవలు మరవలేమన్నారు. ఆయనతో గడిపిన అనేక సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్రమే నిబద్ధతగా ఒక రాజనీతిజ్జుడిని కోల్పోయిందన్నారు.
జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ సంతాపం
చేకూరి కాశయ్య మరణంతో జిల్లా ఒక పెద్ద దిక్కుని కోల్పోయిందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ సంతాపం ప్రకటించారు.