ఈటల తనను కలవలేదు ఫోన్ లో సంప్రదించారు కలిస్తే తప్పేంటి:కిషన్ రెడ్డి
-బీజేపీలో చేరాలంటూ ఈటల పై పెరుగుతున్న వత్తిడి
-కలిసి పోరాటం చేద్దామన్న బీజేపీ నేతలు
-అనుచరులతో మాట్లాడి చెపుతానన్న ఈటల?
తెలంగాణ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలిచిన ఈటల రాజేందర్ బీజేపీ లో చేరుతున్నట్లు వార్తలపై కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.తాను ఈటలను కలవలేదని ఫోన్ లో సంప్రదించిన మాట నిజమేనని అన్నారు .అయితే ఆయన్ను కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. తాను ఈటల శాసనసభలో కలిసి పనిచేశామని గుర్తుచేశారు.తనను కలిసేందుకు ఈటల వస్తానంటే అభ్యంతరం లేదన్నారు. బీజేపీ లో చేరిక విషయం గాని,హుజురాబాద్ లో ఉపఎన్నకలొస్తే పోటీ విషయంగానే ఇంకా పార్టీలో ఎలాంటి చర్చజరగలేదన్నారు.
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్పై అవినీతి ఆరోపణలు రావడం, ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించడం వంటి పరిణామాలు హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించాక ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఏమిటన్న దానిపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి.
ఈటల కొత్త రాజకీయ పార్టీ పెడతారన్న వార్తలు కూడా వచ్చాయి. అలాగే బీజేపీలో చేరతారన్న ఊహాగానాలూ వచ్చాయి. వీటికి బలాన్ని చేకూర్చేలా తాజాగా ఓ విషయం మీడియా దృష్టికి వచ్చింది. ఈటలను తమ పార్టీలో చేరాలని బీజేపీ అధికారికంగా ఆహ్వానం పలికినట్లు తెలిసింది.
ఇటీవల భూ ఆక్రమణల ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నాడని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి ఈటలకు పిలుపు వచ్చిందని . దీనిపై వార్త కథనాల నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందించారు. ఈటల తనను కలిసినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. అయితే తనను కలిసేందుకు ఈటల సంప్రదించిన విషయం వాస్తవమేనని అన్నారు. ఇద్దరం ఫోన్లో మాట్లాడుకున్నామని తెలిపారు.
తాను, ఈటల అనేక ఏళ్లపాటు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కొనసాగామని, ఇద్దరం కలిస్తే తప్పేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈటల వస్తే మాట్లాడేందుకు తనకేమీ అభ్యంతరం లేదన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజీనామాపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనూ కిషన్ రెడ్డి స్పందించారు. హుజూరాబాద్ కు ఉప ఎన్నిక వస్తే పోటీ చేయాలా, వద్దా అనేది ఇంకా బీజేపీ హైకమాండ్ తో చర్చించలేదని తెలిపారు.
కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్రెడ్డితో పాటు కీలక నేత గడ్డం వివేక్ ఈటలతో సమావేశం జరిపి ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంపై కలిసి పోరాటం చేద్దామని వారు ఈటలను కోరగా, దీనిపై తన అనుచరులతో చర్చించి, తన నిర్ణయాన్ని తెలుపుతానని ఈటల రాజేందర్ చెప్పినట్లు సమాచారం.