తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా…
అందరి అభిప్రాయాలు తీసుకున్నాకనే చిహ్నం
అసెంబ్లీలో చర్చించాలని అధికార పార్టీ అభిప్రాయం
చిహ్నం పై 200 పైగా సూచనలు
జూన్ 2 న రాష్ట్ర గీతం మాత్రమే విడుదల …
తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది..!! దీనిపై 200 వరకు సూచనలు రావడంతో మరిన్ని సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు రాష్ట్ర గీతంతో పాటు చిహ్నాన్నీ విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా గీతాన్ని మాత్రమే విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న అధికారిక చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీనిపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్రెడ్డి పలుమార్లు చర్చించారు. కొన్ని నమూనాలు సిద్ధం చేశారు. ప్రజలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. వీటిని మంత్రివర్గ సహచరులకు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చూపించి, వారి సలహాలు, సూచనలు కూడా స్వీకరించి.. తుది రూపు ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు. మరిన్ని సలహాలు, సూచనలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర అధికారిక చిహ్నానికి తుది రూపు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 2న రాష్ట్ర గీతం మాత్రమే విడుదల చేయనున్నారు.