మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో మార్చి 21న దిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్ పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈడీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్కు సంబంధించిన చట్టబద్ధతను విస్తృత ధర్మాసనం తేలుస్తుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీకి అరెస్ట్ చేసే అధికారం, విధానం సహా మూడు ప్రశ్నలను లేవనెత్తారు. విస్తృత ధర్మాసనంలో ఈ కేసు తేలేవరకు మధ్యంతర బెయిల్ అమల్లో ఉంటుందని న్యాయమూర్తులు తెలిపారు. దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులోనే జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసినందున మధ్యంతర బెయిల్ లభించినా కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు.