హర్యానా ప్రజలకు నా సెల్యూట్: ప్రధాని మోదీ..!!
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 90 సీట్లకు కాంగ్రెస్ కూటమి 49 స్థానాల్లో గెలుపొందింది.
బీజేపీ 29 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. హర్యానాలో బీజేపీ ఘన విజయం సాధించింది. హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ మూడో గెలుపు అందించిన సందర్భంగా హర్యానా ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.
”భారతీయ జనతా పార్టీకి మరోసారి స్పష్టమైన మెజారిటీని అందించినందుకు హర్యానా ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. ఇది అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల విజయం. హర్యానా ప్రజల ఆశయాలను నెరవేర్చుతాం. జమ్ము- కశ్మీర్లో బీజేపీ పనితీరుపై గర్వంగా ఉంది. ‘నేషనల్ కాన్ఫరెన్స్’కు అభినందనలు. ఆ పార్టీ ప్రదర్శన మెచ్చుకోదగినది” అని అన్నారు.
జమ్ము కశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు: అమిత్ షా
”జమ్ము కశ్మీర్ ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక ఓట్లతో ఆశీర్వదించారు. బీజేపీ ఇప్పటివరకు కశ్మీర్ చరిత్రలో అత్యధిక సీట్లను అందించారు. ఇందుకు నేను హృదయపూర్వకంగా జమ్ము కశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ఎన్నికల కోసం అవిశ్రాంతంగా పని చేసిన బీజేపీ పార్టీ కార్యకర్తలందరినీ అభినందిస్తున్నా. జమ్ము కశ్మీర్లో శాంతియుత ఎన్నికలు జరుగుతాయని ప్రధాని మోదీ గతంలోనే వాగ్దానం చేశారు.
ఈ క్రమంలోనే తొలిసారి పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి. ఈ చరిత్రాత్మక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం, జమ్ము కశ్మీర్ పాలనాయంత్రాంగం, భద్రత బలగాలు, పౌరులకు అభినందనలు.
..కాంగ్రెస్ హయాంలో జమ్ము కశ్మీర్లో ఉగ్రపాలనే సాగేది. అయితే బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య పండుగను ఘనంగా చేసుకున్నాం. బీజేపీ హర్యానాలో భారీ విజయం సాధించింది. ప్రధాని మోదీ ప్రభుత్వంపై రైతులు, పేదలు, వెనుకబడిన వర్గాలు, సైనికులు, యువత నమ్మకానికి నిదర్శనం” అని ఎక్స్లో పేర్కొన్నారు.