- ఢిల్లీలో దారుణం.. నటి హుమా ఖురేషీ కజిన్ ఆసిఫ్ ఖురేషీ హత్య
- ఇంటి ముందు స్కూటర్ పార్కింగ్ విషయంలో చెలరేగిన వివాదం
- మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీయడంతో ప్రాణాలు తీసిన దుండగులు
- ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ నటి హుమా ఖురేషీ దగ్గరి బంధువు ఆసిఫ్ ఖురేషీ (42) హత్యకు గురయ్యారు. కేవలం స్కూటర్ పార్కింగ్ విషయంలో చెలరేగిన చిన్న గొడవ ప్రాణం తీయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంఘటన గురువారం రాత్రి 11 గంటల సమయంలో నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగింది. ఆసిఫ్ ఖురేషీ ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు తమ స్కూటర్ను అడ్డంగా పార్క్ చేశారు. ఇంటికి దారి లేకుండా ఉండటంతో స్కూటర్ను పక్కకు జరపమని ఆసిఫ్ వారిని కోరారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం మొదలైంది. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆసిఫ్పై దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటనపై హుమా ఖురేషీ తండ్రి, ఆసిఫ్ మేనమామ అయిన సలీమ్ ఖురేషీ మాట్లాడుతూ, “ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు స్కూటర్ పెట్టారు. దారికి అడ్డంగా ఉందని పక్కకు తీయమని నా మేనల్లుడు అడిగాడు. దానికే పెద్ద గొడవ చేసి, ఇద్దరూ కలిసి వాడిని చంపేశారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుడు ఆసిఫ్ ఖురేషీ స్థానికంగా చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్నారని, ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిసింది. చిన్న కారణానికి ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హుమా ఖురేషీ కజిన్ హత్యకు ముందు ఏం జరిగింది?.. !

- ఢిల్లీలోని భోగల్ ప్రాంతంలో గత రాత్రి ఘటన
- హత్యకు దారితీసిన బైక్ పార్కింగ్ గొడవ
- పదునైన ఆయుధాలతో దాడిచేసిన నిందితులు
- సీసీటీవీల్లో రికార్డయిన ఘటన
బాలీవుడ్ నటి హుమా ఖురేషి బంధువు ఆసిఫ్ ఖురేషి (42) ఢిల్లీలోని భోగల్ ప్రాంతంలో గత రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. బైక్ పార్కింగ్ విషయంలో జరిగిన వివాదం ఈ హత్యకు దారితీసినట్టు ఢిల్లీ పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 10:30 గంటల సమయంలో నిందితులకు చెందిన ఒక స్కూటర్ను ఆసిఫ్ ఖురేషి ఇంటి గేటు ముందు పార్క్ చేశారు. బైక్ తీయమని ఆసిఫ్ కోరడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదం ఘర్షణకు దారితీసిందని, నిందితులు పదునైన ఆయుధాలతో ఆసిఫ్పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన ఆసిఫ్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది. ఫుటేజ్లో పలువురు చూస్తుండగానే దుండగులు ఆసిఫ్పై దాడి చేయడం కనిపిస్తోంది. గొడవ ఆపడానికి కొందరు ప్రయత్నించినా, నిందితులు ఆసిఫ్పై దాడి చేస్తూనే ఉన్నారు. గతంలో కూడా పార్కింగ్ విషయంలో గొడవ జరిగిందని, మళ్లీ ఇప్పుడు ఇలా జరిగిందని ఆసిఫ్ భార్య పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.