అంతర్జాతీయం

భారత్ లో పెట్రోల్, డీజిల్ ఆంక్షలు తప్పవా..?

  • హార్మూజ్ జలసంధి మూసివేత.. నిలిచిన చమురు నౌకలు
  • ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం.. రేషనింగ్ దిశగా ప్రభుత్వం యోచన
  • రష్యా ముడిచమురుపైనే భారత్ ఆశలు.. ఎగుమతులపై ఆంక్షలు!

పశ్చిమాసియాను కమ్ముకున్న యుద్ధ మేఘాలు సామాన్య భారతీయుడి జేబుపై, వంటింటిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు దాదాపుగా స్తంభించిపోవడమే దీనికి ప్రధాన కారణం. సాధారణంగా రోజుకు 19.8 మిలియన్ బారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా రవాణా కావాల్సి ఉండగా ఈ నెల 1 నాటికి అది ఏకంగా 86 శాతం పడిపోయి కేవలం 2.8 మిలియన్ బారెళ్లకు చేరుకుంది. చమురు సరఫరాలో అంతరాయం ఇలాగే కొనసాగితే, దేశీయ అవసరాల దృష్ట్యా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎల్పీజీ రేషనింగ్:
భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 80-85 శాతాన్ని గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత నిల్వలు కేవలం రెండు వారాలకు మాత్రమే సరిపోతాయని అంచనా. ఈ నేపథ్యంలో గృహ అవసరాలకు సిలిండర్ల సరఫరాపై ప్రభుత్వం ‘రేషనింగ్’ (పరిమిత సరఫరా) విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కోత:
భారత్ తను ఉత్పత్తి చేసే పెట్రోల్‌లో మూడో వంతు, డీజిల్‌లో నాలుగో వంతు విదేశాలకు ఎగుమతి చేస్తుంది. దేశీయంగా కొరత రాకుండా ఉండటం కోసం ఈ ఎగుమతులను నిలిపివేసి, ఆ నిల్వలను స్థానిక వినియోగానికే మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.

చమురు నిల్వల పరిస్థితి ఏంటి..
కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సరఫరా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. భారత్ వద్ద ప్రస్తుతం ఉన్న వ్యూహాత్మక నిల్వలు, రిఫైనరీలు మరియు ఓడరేవుల్లోని నిల్వలు కలిపి సుమారు 74 రోజుల అవసరాలకు సరిపోతాయని ఆయన తెలిపారు. ముడి చమురు నిల్వలు: 17-18 రోజుల వరకు, శుద్ధి చేసిన ఇంధనాలు: 20-21 రోజుల వరకు, ఎల్ఎన్జీ నిల్వలు: 10-12 రోజుల వరకు సరిపోతాయి.

ప్రత్యామ్నాయ మార్గాల వేట..
గల్ఫ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో భారత్ ఇప్పుడు రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను మరింత పెంచుకోవాలని చూస్తోంది. అలాగే అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి చమురు సేకరణకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం ‘‘రోజుల పాటు కాదు, వారాల పాటు’’ సాగే అవకాశం ఉందని హెచ్చరించడం భారత్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలకు ఇంధన లభ్యతలో ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Related posts

కెనడా పార్లమెంట్ వెలుపల ‘ఓం’ జెండాను ఎగురవేసిన భారత సంతతి ఎంపీ

Ram Narayana

ఉక్రెయిన్‌లో దారుణం.. పార్లమెంట్ మాజీ స్పీకర్ కాల్చివేత…

Ram Narayana

భౌతిక శాస్త్రంలో ఈ ముగ్గురికి నోబెల్ బహుమతి…

Ram Narayana