- వచ్చే ఎన్నికల్లో 70కి పైగా స్థానాల్లో పోటీ చేయడం ఖాయమని జనసేన నేత కిరణ్ రాయల్ వెల్లడి
- 21 సీట్లతో సరిపెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
- పవన్ కల్యాణ్ లేకుంటే కూటమి అధికారంలోకి వచ్చేది కాదని వ్యాఖ్య
- చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవనే టీడీపీకి అండగా నిలిచారన్న కిరణ్ రాయల్
ఏపీ రాజకీయాల్లో జనసేన తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 70కి పైగా స్థానాల్లో పోటీ చేయడం ఖాయమని, కేవలం 21 సీట్లు ఇస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలతో పోలిస్తే జనసేన పార్టీ బలం గణనీయంగా పెరిగిందని, భవిష్యత్తులో సీట్ల సర్దుబాటులో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన పరోక్షంగా మిత్రపక్షాలకు సూచించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వల్లే ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందని కిరణ్ రాయల్ అన్నారు. “పవన్ కల్యాణ్ లేకపోతే టీడీపీ ఎన్నికల బరిలో నిలబడటమే కష్టమయ్యేది. ఈ విషయంలో టీడీపీ నేతలకు నేను సవాల్ విసురుతున్నా” అని వ్యాఖ్యానించారు. రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో ఉంటే, పవన్ ముందుకొచ్చి కూటమి ఏర్పాటు చేసి వారికి ధైర్యం ఇచ్చారని గుర్తుచేశారు. ఆ క్లిష్ట సమయంలో పవన్ చూపిన చొరవ వల్లే కూటమి విజయం సాధించిందని, ప్రజలు పవన్ కల్యాణ్ను నమ్మి ఓట్లు వేశారని అభిప్రాయపడ్డారు.
గత ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవడానికి గల కారణాలను కూడా కిరణ్ రాయల్ వివరించారు. రాజకీయాల్లో ప్రజాబలంతో పాటు ఆర్థిక బలం కూడా అవసరమని, ఆ సమయంలో ఆర్థికంగా బలంగా లేకపోవడం వల్లే పోటీకి దూరంగా ఉన్నానని తెలిపారు. తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్, హరిప్రసాద్తో తనకు విభేదాలు ఉన్నాయనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. తామంతా పవన్ నాయకత్వంలో జనసేన పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా పోటీ చేశాయి. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లోనూ 100 శాతం స్ట్రైక్ రేట్తో చారిత్రక విజయం సాధించింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.