బెంగాల్ రాజకీయాల్లో కొత్త ఎత్తుగడ.. హుమయూన్ కబీర్తో ఓవైసీ దోస్తీ
అసదుద్దీన్ ఒవైసి ఐఎంఐఎం అధినేత గతంలో కేవలం హైద్రాబాద్ కె పరిమితమైన పార్టీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ముస్లిమ్లను సమీకరించి పోటీచేస్తుంది …సాంప్రదాయకంగా ముస్లీమ్ ఓట్లు బీజేపీ వ్యతిరే శిబిరానికి పడతాయి .దీంతో ఆ పార్టీలకు లబ్ది చేకూరుతుంది … కానీ ఒవైసి ఎంటర్ అయిన తర్వాత ముస్లిం ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా తీర్పు నివ్వబోతున్నాయి …ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో జరిగింది అదే …ఇప్పుడు బెంగాల్ లో కూడా ఒవైసి పార్టీ అక్కడ ఉన్న హుమాయూన్ కబీర్ తో చేతులు కలపడం ద్వారా గతంలో టీఎంసీ కు పడే ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి లబ్ది చేకూర్చే విధంగా ఒవైసి వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి…
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ అనుకుంటున్న తరుణంలో, అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కొత్త సమీకరణాలకు తెరలేపింది. రాష్ట్రంలో తన ఉనికిని బలంగా చాటుకోవాలనే లక్ష్యంతో, మాజీ మంత్రి హుమయూన్ కబీర్ స్థాపించిన రాజకీయ పక్షంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ పరిణామం ఇప్పుడు బెంగాల్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఒంటరిగా పోటీ చేసి పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఎంఐఎం, ఈసారి పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పట్టున్న స్థానిక నేతలతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా, ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో గట్టి పట్టున్న హుమయూన్ కబీర్తో చేతులు కలిపింది. ఈ కూటమి ప్రధాన లక్ష్యం మైనారిటీ ఓట్లను సమీకరించడమే. ఈ పొత్తు ద్వారా ముస్లిం ఓట్లను తమవైపు తిప్పుకోవాలని ఓవైసీ భావిస్తున్నారు.
అయితే, ఈ కొత్త కూటమి ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. సంప్రదాయంగా మైనారిటీ ఓటు బ్యాంకుపై ఆధారపడిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్కు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మైనారిటీ ఓట్లు ఎంఐఎం-హుమయూన్ కూటమి వైపు మళ్లితే, అది టీఎంసీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని, పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లో దాదాపు 20 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు ఎంఐఎం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే హుమయూన్ కబీర్ అనుచరులతో ఎంఐఎం ప్రతినిధులు క్షేత్రస్థాయిలో చర్చలు ప్రారంభించారు. సీట్ల సర్దుబాటుపై త్వరలోనే పూర్తి స్పష్టత రానుంది.