ఇది పాదయాత్ర కాదు రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తోన్న యాత్ర: చంద్రబాబు…
-పాదయాత్రకు కాంగ్రెస్ నేత రేణుక చౌదరి సంఘీభావం
-రేణుకకు స్వాగతంపలికేందుకు రైతుల ప్రయత్నం …పోలిసుల ఆంక్షలు
-అమరావతి రాజధాని రైతులు చేస్తోన్న పాదయాత్రకు మద్దతు
-ఐదు కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతి
-అమరావతిని కాపాడుకోలేకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంధకారం
-అమరావతిపై వైసీపీ అనేక అసత్య ప్రచారాలు చేస్తోందన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అమరావతి రాజధాని రైతులు చేస్తోన్న పాదయాత్రకు ఆయన మద్దతు తెలిపారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతి అని ఆయన అన్నారు. రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు తమ పార్టీ సంఘీభావం తెలుపుతోందని ప్రకటించారు. అమరావతిని కాపాడుకోలేకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమేనని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వారంతా పాదయాత్రకు మద్దతు తెలపాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఇది పాదయాత్ర కాదని, ఏపీ పరిరక్షణ కోసం చేస్తోన్న యాత్ర అని, అమరావతి రాజధానిపై వైసీపీ అనేక అసత్య ప్రచారాలకు పాల్పడిందని చంద్రబాబు నాయుడు అన్నారు. అయినప్పటికీ రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన కొనియాడారు.
అమరావతి రైతుల పాదయాత్రకు రేణుకా చౌదరి సంఘీభావం..
రేణుకకు స్వాగతం పలకకుండా ఆంక్షలు విధించిన పోలీసులు
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ప్రారంభమయింది. తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర తిరుపతిలో ముగియనుంది. 45 రోజుల పాటు దాదాపు 450 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రకు టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు పలికాయి. మరోవైపు రైతుల పాదయాత్రకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి సంఘీభావం ప్రకటించారు. రైతలకు మద్దతు ప్రకటించేందుకు ఆమె ర్యాలీగా బయల్దేరారు.
మరోవైపు రేణుకాచౌదరికి స్వాగతం పలికేందుకు, ఆమెకు హారతి ఇచ్చేందుకు మూలపాడు గ్రామంలో కాంగ్రెస్ మహిళా నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. అయితే స్వాగతం పలకడంవంటి పనులు చేయవద్దని, రోడ్డుపై ఎవరూ ఉండొద్దని పోలీసులు వారిపై ఆంక్షలు విధించారు. మరోవైపు విజయవాడలో రేణుకా చౌదరి మాట్లాడుతూ, చేతులకు వేసుకున్నది గాజులు కాదని, విష్ణుచక్రాలని అన్నారు. ప్రభుత్వం ఏం చేసుకున్నా సరే… వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు.