ఏపీ బీజేపీకి కోర్ కమిటీని ప్రకటించిన అధిష్ఠానం…
- కీలక నిర్ణయాలు తీసుకోవడం కోసం కమిటీ
- సోము వీర్రాజు సహా 13 మంది సభ్యులతో కమిటీ
- ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులకు కమిటీలో చోటు
- కమిటీలో పురందేశ్వరి, సుజనా తదితరులకు స్థానం
ఏపీ బీజేపీ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది.అందులో భాగంగానే రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటివరకు టీడీపీ ఎక్కుపెట్టిన బాణాలను ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సూచనల మేరకు వైసీపీ పై ఎక్కుపెట్టాలని నిర్ణయించారు. రాజధాని అమరావతి కావాలని పాదయాత్ర చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. మూడు రాజధానులపై తమ విధానం ప్రకటించకుండానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీని ప్రక్షాల చేయటంతో పాటు ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలనీ తీర్మానించుకున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కార్యక్రమాలను రూపొందించుకునేందుకు కొర్ కమిటీని నియమించారు.
రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం కోసం ఏపీ బీజేపీకి కోర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ పార్టీ అధిష్ఠానం ఓ ప్రకటన చేసింది. ఈ కోర్ కమిటీలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా 13 మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు.
ఈ కమిటీలో సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, సత్యకుమార్, ఎమ్మెల్సీ మాధవ్, మధుకర్, నిమ్మక జయరాజ్, రేలంగి శ్రీదేవి, చంద్రమౌళి సభ్యులు కాగా… సునీల్ దేవధర్, మురళీధర్, శివప్రకాశ్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని బీజేపీ హైకమాండ్ వెల్లడించింది.